దేవీ నవరాత్రుల పూజను ఎలా జరుపుకోవాలంటే…

-

భారతీయుల ప్రధాన పండుగలలో విజయ దశమి లేదా దసరా ఒకటి. దేశవ్యాప్తంగా ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. విజయ దశమి, దసరాగా పిలవబడే ఈ పర్వదినం ముందు తొమ్మిది రాత్రులు దేవిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కోరోజు ఒక్కో రూపంలో అలంకరించి పూజిస్తారు. తొలి మూడు రోజులు పార్వతిగా, తర్వాతి మూడు రోజులు లక్ష్మీగా, చివరి మూడు రోజులు సరస్వతిగా ఆరాధిస్తారు. నవరాత్రుల్లో దేవిని పూజిస్తే పది జన్మల పాపాలు తొలగిపోతాయని ప్రగాఢ నమ్మకం. శరన్నవరాత్రుల్లో నవదుర్గల అలంకారంలో పరాశక్తి దర్శనమిస్తుంది.

- Advertisement -

పురాణాల్లో నవ అనే శబ్దానికి పరమేశ్వరుడు, రాత్రి అనే శబ్దానికి పరమేశ్వరి అనే అర్థం. పార్వతీపరమేశ్వరుల ఆరాధనే నవరాత్రోత్సవాల వ్రతమని పిలుస్తారు. నవ అంటే నూతన అని, రాత్రి అంటే జ్ఞానం అని అర్థం. వీటిని భక్తులకు ప్రసాదించే రోజే నవరాత్రి ఉత్సవాలు అని చెప్పారు.

తొలిరోజు- శైలపుత్రి

శ్లోకం: వందే వాంఛితలాభాయ చంద్రార్థకృతశేఖరామ్‌!, వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశ స్వినీమ్‌!!..

నవరాత్రుల్లో మొదటిరోజు అమ్మవారు త్రిశూల ధారిణి అయిన హిమవంతుని కుమార్తెగా, శైలపుత్రిగా నంది వాహనంపై భక్తులకు దర్శనమిస్తుంది. శైలపుత్రీదేవికి పాడ్యమి రోజు విశేషంగా సమర్పించే నైవేద్యం పులగం. తొలి రోజు భక్తిశ్రద్ధలతో అమ్మను పూజించి పులగం నివేదించిన వారికి ఆ తల్లి సకల శక్తి సామర్థ్యాలనూ, యశస్సునూ అందిస్తుంది.

రెండో రోజు- బాలాత్రిపుర సుందరీ

శ్లోకం: హ్రీంకారాసన గర్భితానల శిఖాం సౌఃక్లీం కళాంబిభ్రతీం సౌవర్ణాంబర ధారిణీం వసుధాదౌతాం; త్రినేత్రోజ్జ్వలామ్‌ వందే పుస్తక పాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్జ్వలాం తాంగౌరీం త్రిపురాం పరాత్పర కళాంశ్రీచక్ర సంచారిణీమ్‌!!

రెండో రోజు పరాశక్తి బాలాత్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తుంది. త్రిపుర సుందరీదేవి శ్రీ చక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత. షోడశ విద్యకు అధిష్టాన దేవత. అందుకే ఉపాసకులు త్రిపురసుందరీదేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు. అందుకే ఈ రోజున రెండు నుంచి పదేళ్లలోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి కుమారి పూజచేస్తారు. త్రిశతీ పారాయణం గావిస్తారు. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం త్రిపుర సుందరీదేవి అధీనంలో ఉంటాయి. సత్సంతానాన్ని అనుగ్రహిస్తుంది. అభయహస్త ముద్రతో, అక్షమాల ధరించిన జగన్మాతను ఆరాధిస్తే మనోవికారాలు తొలిగిపోతాయి.

మూడో రోజు- గాయత్రీదేవి

శ్లోకం:ముక్తావిద్రుమ హేమనీల ధవళచ్ఛాయైుర్ముఖై స్త్రీ‌క్షణైః యుక్తామిందుని బద్ధరత్న మకుటాం తత్త్వార్థ వర్ణాత్మికామ్‌, గాయత్రీం వరదాభయాంకుశ కశాశ్శుభ్రం కపాలం గదాం శంఖంచక్ర మధారవింద యుగళం హస్తైర్వహంతీ భజే.

వేద స్వరూపం గాయత్రీదేవి. అన్ని మంత్రాలకు మూలశక్తి గాయత్రీ మంత్రం. మూడో రోజు ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలు కలిగిన ఐదు ముఖాలతో.. శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి దర్శనమిస్తుంది. గాయత్రీ ఉపాసానతో మంత్రసిద్ధి, బ్రహ్మ జ్ఞానం కలుగుతాయి. గాయత్రీ మంత్ర జపంతో చతుర్వేద పారాయణ ఫలితం లభిస్తుంది. ‘ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్‌’ అనే మంత్రాన్ని జపిస్తూ అమ్మను ధ్యానించాలి.

నాలుగో రోజు- అన్నపూర్ణదేవి

శ్లోకం: ఉర్వీసర్వజయేశ్వరీ జయకరీ మాతాకృపాసాగరీ, నారీనీలసమానకుంతలధరీ నిత్యాన్న దానేశ్వరీ; సాక్షాన్మోక్షకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ.. భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ.

ఐదో రోజు అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు. ప్రాణికోటికి జీవనాధారం అన్నం. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. సాక్షాత్తు పరమేశ్వరుడికే భిక్షపెట్టిన దేవత అన్నపూర్ణాదేవి. ఈ తల్లిని ధ్యానిస్తే ధనధాన్యవృద్ధి, ఐశ్వర్య సిద్ధి కలుగుతాయి. అన్నపూర్ణాదేవి ధరించిన రసపాత్ర అక్షయ శుభాలను అందిస్తుంది

ఐదో రోజు- లలితాదేవి

శ్లోకం: ప్రాతఃస్మరామి లలితా వదనారవిందం, బింబాధరం పృథులమౌక్తిక శోభినాసమ్‌; ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యం, మందస్మితం మృగమదోజ్జ్వల ఫాలదేశమ్‌!

త్రిపురాత్రయంలో లలితాదేవి రెండో శక్తి. దేవీ ఉపాసకులకు ముఖ్యదేవత. త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపంలో ఐదో రోజున దర్శనమిస్తుంది. లక్ష్మీ సరస్వతులు ఇరువైపులా నిలబడి వింజామరలు వీస్తుండగా శ్రీచక్ర అధిష్ఠాన శక్తిగా కొలువుదీరుతుంది. చెరుకుగడ, విల్లు, పాశాంకుశాలను ధరించి భక్తులకు వరాలిస్తుంది. లలితాదేవి విద్యా స్వరూపిణి. మాంగల్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. దేవి అనుగ్రహం కోసం సువాసినీ పూజ చేయాలి. సమస్త సుఖాలు ప్రసాదించే శక్తి స్వరూపిణి లలితాదేవి.

ఆరో రోజు- మహాలక్ష్మీ

శ్లోకం: లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం దాసీ భూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం; శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం, త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం

రెండు చేతులలో మాలలను ధరించి, అభయవరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ, గజరాజు సేవిస్తుండగా శ్రీమహాలక్ష్మిీ రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. మహాలక్ష్మీ సర్వమంగళకారిణి, ఐశ్వర్యప్రదాయిని. అష్టలక్ష్ముల సమష్టి రూపమే మహాలక్ష్మీ. డోలాసురుడు అనే రాక్షసుడిని వధించింది. శక్తి త్రయంలో మధ్య శక్తి. మహాలక్ష్మీని ఉపాసిస్తే ఫలితాలు త్వరితంగా కలుగుతాయి. యాదేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా అంటే అన్ని జీవలలోనూ ఉండే లక్ష్మీస్వరూపం దుర్గాదేవని చండీసప్తసతి చెబుతోంది. శరన్నవరాత్రులలో మహాలక్ష్మిని పూజిస్తే సర్వ మంగళ మాంగల్యాలు కలుగుతాయి.

ఏడో రోజు- సరస్వతీదేవి

శ్లోకం: యా కుందేందు తుషార హార ధవళా యాశుభ్ర వస్త్రాన్వితా, యా వీణా వరదండ మండితకరా యా శ్వేత పద్మాసనా, యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవైస్సదా పూజితా, సామాంపాతు సరస్వతీ భగవతీ నిశ్శేష జాడ్యాపహా.

శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రానికి చాలా విశిష్టత ఉంది. జగన్మాత చదువుల తల్లి సరస్వతీ రూపంలో దర్శనమిచ్చే రోజు. బ్రహ్మ చైతన్య స్వరూపిణిగా సరస్వతీని పురాణాలు అభివర్ణించాయి. శ్వేతపద్మాన్ని ఆసనంగా అధిష్టించి, వీణ, దండ, కమండలం, అక్షమాల ధరించి, అభయముద్రతో భక్తుల అజ్ఞాన తిమిరాలను దూరం చేస్తుంది. త్రిశక్తి రూపాల్లో సరస్వతి మూడో శక్తి రూపం. సంగీత సాహిత్యాలకు అధిష్టాన దేవత. ఈ తల్లిని ఆరాధించడం వల్ల బుద్ధి వికాసం, విద్యాలాభం కలుగుతాయి.

ఎనిమిదో రోజు- దుర్గాదేవి

శ్లోకం:సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే, శరణ్యే త్య్రంబకే గౌరి నారాయణి నమోస్తుతే.

దుర్గతులను నివారించే పరాశక్తి దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. ఈ అవతారంలో దుర్గముడనే రాక్షసుడిని అమ్మవారు సంహరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. పంచ ప్రకృతి మహాస్వరూపాల్లో మొదటిది దుర్గారూపం. భవబంధాలలో చిక్కుకున్న మానవుడిని అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదించే మాత. కోటి సూర్యప్రభలతో వెలిగొందే అమ్మను అర్చిస్తే శత్రుపీడనం తొలగిపోతుంది. సర్వత్రా విజయం ప్రాప్తిస్తుంది. ఎర్రని వస్త్రం సమర్పించి, ఎర్రటి అక్షతలు, ఎర్రటి పుష్పాలతో అమ్మను పూజించాలి.

తొమ్మిదో రోజు- మహిషాసురమర్దినీదేవి

శ్లోకం: మహిషమస్తక నృత్తవినోదిని, స్ఫుటరణన్మణి నూపుర మేఖలా, జననరక్షణ మోక్షవిధాయినీ, జయతి శుంభనిశుంభ నిషూదినీ

నవ అవతారాల్లో మహిషాసురమర్దినిని మహోగ్రరూపంగా భావిస్తారు. మహిషాసురుని సంహరించిన అశ్వయుజ శుద్ధ నవమిని ‘మహర్నవమి’గా జరుపుకుంటారు. సింహవాహనాన్ని అధిష్టించి ఆయుధాలను ధరించిన చండీ సకల దేవతల అంశలతో మహాశక్తి స్వరూపంగా దర్శనమిస్తుంది. ఈ తల్లిని పూజిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. మహిషాసురమర్దిని ఆరాధన వల్ల భయాలన్నీ తొలగిపోతాయి. సర్వకార్యాల్లో విజయం సిద్ధిస్తుంది.

పదో రోజు- రాజరాజేశ్వరీదేవి

శ్లోకం: అంబా రౌద్రిణి భద్రకాళీ బగలా జ్వాలాముఖీ వైష్ణవీ, బ్రహ్మాణీ త్రిపురాంతకీ సురసుతా దేదీప్యమానోజ్జ్వలా, చాముండా శ్రితరక్షపోషజననీ దాక్షాయణీ పల్లవీ చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ.

శరన్నవరాత్రుల్లో అమ్మవారి చివరి అలంకారం రాజరాజేశ్వరీదేవి. భువన బ్రహ్మాండాలకు ఆరాధ్య దేవత. మహాత్రిపుర సుందరిగా పూజలు అందుకుంటుంది. ‘అపరాజితాదేవి’గా భక్తులు ఆరాధిస్తారు. పరమేశ్వరుడి అంకం ఆసనంగా.. ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులను భక్తులకు అనుగ్రహిస్తుందీ తల్లి. యోగమూర్తిగా.. మాయామోహిత మానవ చైతన్యాన్ని ఉద్దీపనం చేస్తుంది. అనంత శక్తి స్వరూపమైన శ్రీ చక్రానికి ఈ తల్లి అధిష్టాన దేవత. లలితా సహస్రనామ పారాయణం, కుంకుమార్చన చేయాలి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థి ఎవరంటే..?

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిని బీజేపీ ప్రకటించింది. మాజీ మంత్రి సదాలక్ష్మి,...

వైసీపీ అభ్యర్థికి 18నెలల జైలు శిక్ష.. విశాఖ కోర్టు సంచలన తీర్పు..

దళితులకు శిరోముండనం కేసులో విశాఖ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ...