పంతం మూవీ రివ్యూ

0
91

చిత్రం: ‘పంతం’

నటీనటులు: గోపీచంద్ – మెహ్రీన్ కౌర్ – సంపత్ రాజ్ – ముకేష్ రుషి – తనికెళ్ల భరణి – శ్రీనివాసరెడ్డి – పృథ్వీ – జయప్రకాష్ రెడ్డి – కౌముది – పవిత్ర లోకేష్ – హర్షవర్ధన్ తదితరులు
సంగీతం: గోపీసుందర్
ఛాయాగ్రహణం: ప్రసాద్ మూరెళ్ళ
మాటలు: రమేష్ రెడ్డి
స్క్రీన్ ప్లే : కె.చక్రవర్తి – బాబీ
నిర్మాత: కె.కె.రాధామోహన్
కథ – దర్శకత్వం: కె.చక్రవర్తి

మాస్ హీరో ఇమేజ్ సంపాదించడం చాలా కష్టం. ఒక్కసారి మాస్ హీరోగా క్రేజ్ సంపాదిస్తే వరస పరాజయాలు వచ్చినా మళ్లీ నిలదొక్కుకోవడానికి ఒక్క హిట్ చాలు. అలాంటి హిట్ కోసమే హీరో గోపీచంద్ చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. మాస్ హీరోగా ఇమేజ్ సంపాదించుకున్న గోపీచంద్‌ను గత కొంతకాలంగా అపజయాలు వెంటాడుతున్నాయి. దీంతో ఎలాగైనా హిట్టు కొట్టాలనే ‘పంతం’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మరి గోపీచంద్ ‘పంతం’ నెగ్గిందా.. ఈ సినిమా ఆయనకు మళ్లీ పూర్వవైభవం తెచ్చిపెడుతుందా..? చూద్దాం..!

విక్రాంత్(గోపీచంద్) తెలివైన దొంగ. హెల్త్ మినిష్టర్ (జయప్రకాశ్ రెడ్డి) కాన్వాయ్‌నే కొట్టేస్తాడు. ఆ తరవాత హోమ్ మినిష్టర్ జయేంద్ర (సంపత్ రాజ్) అలియాస్ నాయక్ భాయ్ అక్రమ సంపాదనపై కన్నేస్తాడు. బినామీల పేరిట అక్రమంగా సంపాదించిన కొన్ని కోట్ల రూపాయలను విక్రాంత్ దోపిడీ చేస్తాడు. అయితే తన డబ్బును కావాలనే ఎవడో కాజేస్తున్నాడని గ్రహించిన జయేంద్ర అతనిపై సీబీఐ ఎంక్వైరీ వేస్తాడు. కానీ ఎలాంటి ఆధారాలు దొరకవు. తిలక్(తనికెళ్ల భరణి) అనే వ్యక్తి ద్వారా విక్రాంత్ గురించి జయేంద్రకు ఒక షాకింగ్ నిజం తెలుస్తుంది. ఇంతకీ ఏంటా నిజం..? ఈ తిలక్ ఎవరు..? అసలు విక్రాంత్ ఈ దోపిడీలు ఎందుకు చేశాడు..? ఇదే సినిమా!

సినిమా ఎలా ఉందంటే..
అవినీతిలో కూరుకుపోయి అక్రమంగా ప్రజల సొమ్మును దోచుకునే రాజకీయ నాయకులు.. వాళ్ల దగ్గర నుంచి ఆ డబ్బును కాజేసి ప్రజలకు పంచేసే హీరో.. ఇలాంటి రాబిన్ హుడ్ సినిమాలు ఇప్పటి వరకూ చాలానే వచ్చాయి. ఇది కూడా ఆ కోవకు చెందిన సినిమానే. కాకపోతే దీనికి అదనంగా చిన్న పాయింట్ జత చేశారు. అదేంటో చెప్పేస్తే మీకు సినిమా చూడాలనే ఆసక్తి తగ్గిపోతుంది. కాబట్టి ప్రస్తుతానికి దాని గురించి పక్కనపెడదాం.

ఇది గోపీచంద్‌కు 25వ చిత్రం కావడంతో కచ్చితంగా ప్రత్యేకంగా ఉంటుందని ఆయన అభిమానులు భావించి ఉండొచ్చు. కానీ ఇది కూడా రొటీన్ మాస్ చిత్రమే. కాకపోతే వేగవంతమైన కథనం, కామెడీ, ఫైట్స్‌తో ఆసక్తిగానే నడిపించారు. అయితే సినిమా మంచి ఫ్లోలో ఉన్నప్పుడు స్పీడ్ బ్రేకర్లలా వచ్చే పాటలు విసిగిస్తాయి. ప్రేక్షకుడికి మరీ బోర్ కొట్టకుండా దర్శకుడు చక్రవర్తి జాగ్రత్తపడ్డారు కానీ ఓ కొత్త సినిమా చూసిన భావననైతే కలిగించలేకపోయారు. ఫస్టాఫ్‌లో హీరో తెలివిగా డబ్బులు దోచేయడం, హీరోయిన్(మెహ్రీన్)తో ప్రేమ, పృథ్వీ‌తో గోపీచంద్, శ్రీనివాసరెడ్డి కామెడీ, రెండు ఫైట్లతో నడిపించేశారు. సినిమాకు బలం సెకండ్ హాఫే.

ఫస్టాఫ్‌లో ట్రిమ్ చేసిన గడ్డంతో రఫ్‌గా కనిపించిన గోపీచంద్.. సెకండ్ హాఫ్‌ ఫ్లాష్ బ్యాక్‌లో చాలా హ్యాండ్‌సమ్‌గా కనిపించాడు. ప్రీ క్లైమాక్స్‌లో కోర్టు సీన్ సినిమాకు ప్రధాన బలం. చాలా సినిమాల్లో ఉన్నట్టే హీరోనే తన కేసును వాదించుకోవడం, ఆధారాలు సమర్పించడం, సోషల్ మెసేజ్‌తో కూడిన డైలాగులు క్లైమాక్స్‌లో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్‌లో బాంబ్ బ్లాస్ట్ బాధితులు తమ బాధను హీరోకు చెప్పుకునే సన్నివేశాలు ప్రేక్షకుడితో కంటతడి పెట్టిస్తాయి.

చివ‌రిగా – గోపిచంద్ పంతం ప‌ర్వాలేదు అనిపించింది

రేటింగ్: 2.5/5