మహిళా రిజర్వేషన్ ఇప్పటి వరకు అమలు కాలేదని, దాని వల్ల మహిళలు రాజకీయంగా తీవ్రంగా నష్టపోతున్నారన్నారు కవిత(MLC Kavitha). మహిళా రిజర్వేషన్ను జనగణనతో ముడిపెట్టి కేంద్రం కావాలనే జాప్యం చేస్తుందన్నారామే. కేంద్ర బడ్జెట్లో జన గణనకు ఎందుకు నిధులు కేటాయించలేదని కవిత ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో కవిత పాల్గొన్నారు. ఈ సందర్బంగానే మహిళలకు జరుగుతున్న అన్యాయాన్ని ఆమె లేవనెత్తారు. ప్రతి అంశంలో మహిళలకు అన్యాయం చేస్తున్నారంటూ రాష్ట్రంలోని కాంగ్రెస్, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఎండగట్టారు కవిత.
‘‘మహిళా రిజర్వేషన్ చట్టాన్ని(Women’s Reservation Bill) అమలు చేయకపోవడంతో రాజకీయంగా నష్టపోతున్నారు మహిళలు. మహిళా రిజర్వేషన్ చట్టాన్ని జనగణనతో ముడిపెట్టి ఇప్పటికీ కేంద్రం అమలు చేయడం లేదు. మహిళా రిజర్వేషన్లు అమలు కానందువల్ల మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానా వంటి ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో మహిళలు తీవ్రంగా నష్టపోయారు. జనగణనకు బడ్జెట్ లో ఎందుకు నిధులు పెట్టలేదు? త్వరగా జనగణన చేస్తే.. రాబోయే బీహార్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో మరింత మంది మహిళలు ఎమ్మెల్యేలు అవుతారు. ప్రతీ మహిళకు రూ.2500 ఇస్తామన్న హామీని అమలు చేసే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెంటాడుతాం. మహిళా సంఘాల ద్వారా అద్దెకు తీసుకుంటున్న బస్సులకు ఆర్టీసీ సకాలంలో కిరాయి చెల్లిస్తుందా లేదా స్పష్టత ఇవ్వాలి’’ అని డిమాండ్ చేశారు.
‘‘అంగన్ వాడీ, ఆశా వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం జీతాలు పెంచకపోవడం సరికాదు. మహిళలను ఎలా కోటీశ్వరులను చేస్తారో నిర్దిష్టమైన ప్రణాళికను ప్రభుత్వం బహిర్గతం చేయాలి. కేసీఆర్ మహిళా కేంద్రీకృత పాలన చేశారు. మహిళల కోసం కేసీఆర్ అనేక పథకాలు, కార్యక్రమాలు చేపట్టారు. కేసీఆర్ పెట్టిన పథకాలను తీసేసే కర్కోటక ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది. కేరళ ప్రభుత్వ పాఠ్య పుస్తకాల్లో మహిళ, పురుషల సమానత్వపు బొమ్మలు ప్రచురిస్తున్నారు. అలాంటి చర్యలు తెలంగాణలో కూడా రావాల్సి ఉంది. సమాజం ఎదుగుదలలో మహిళల పాత్ర గణనీయం. ప్రపంచ వ్యాప్తంగా మహిళలకు సమాన హక్కులు, గౌరవం, నిర్ణయాధికారం రావాల్సి ఉంది. అప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుంది. చిట్యాల ఐలమ్మ, రాణి రుద్రమదేవి వంటి వీర మహిళలు తెలంగాణ గడ్డపై పుట్టడం మనకు గర్వకారణం’’ అని అన్నారు.
‘‘మహిళలకు కులమతాలు లేవు.. మహిళలది ఒకే కులం. మహిళలు ఐక్యంగా ఉండి హక్కులను సాధించుకోవాలి. ఇళ్లలో మహిళలు ద్వితియ శ్రేణి పౌరులుగా ఉంటున్నారన్న వాదన వీగిపోవాలి. అమెరికాలో 40 శాతం మహిళలు ఉద్యోగాలు చేస్తుంటే భారత్ లో మాత్రం అది 17 శాతంగానే ఉంది. దేశంలో 50 శాతం మహిళలు ఉద్యోగాలు చేస్తే దేశ జీడీపీకి మనం రూ. 5 లక్షల కోట్ల ఆదాయం ఇవ్వగలుగుతాం. కానీ మహిళలు ఉద్యోగాలు చేయడానికి గల సౌకర్యాలు ఉన్నాయా? అన్నది ఆలోచించాలి. భూగర్భ గనుల్లో పనిచేయడం నుంచి అంతరిక్షంలోకి వెళ్లే వరకు మహిళలు ఎదిగారు. అయినా అనేక అవాంతరాలు ఉన్నాయి.. వాటిని అధిగమించాల్సిన అవసరం ఉంది’’ అని వ్యాఖ్యానించారు.