బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోద ముద్ర వేసింది. ఈ నేపథ్యంలో దీనికి చట్టబద్దత కల్పించడం కోసం పార్లమెంటులో ఆమోదం అందాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఈ విషయంపై చర్చించడానికి ప్రధాని మోదీని(PM Modi) కలవాలని తెలంగాణ సీఎం రేవంత్(Revanth Reddy) నిశ్చయించుకున్నారు. ఈ మేరకు అపాయింట్మెంట్ ఇవ్వాలని కోరుతూ మోదీకి రేవంత్ లేఖ రాశారు. వెనుకబడిన తరగతులకు విద్య, ఉద్యోగ రంగాలతో పాటు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ల కల్పనకు సంబంధించి శాసనసభ రెండు వేర్వేరు బిల్లులను ఆమోదించిన నేపథ్యంలో రేవంత్.. మోదీ అపాయింట్ మెంట్ కోరారు.
తెలంగాణ శాసనసభలో ప్రాతినిథ్యం వహిస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఏఐఎంఐఎం, సీపీఐ నాయకుల బృందంతో కలిసేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ మద్దతు కోసం అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రధానమంత్రిని కలుద్దామని ఈ రెండు బిల్లులపై శాసనసభలో చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి చేసిన ప్రతిపాదనపై అన్ని పక్షాలు అంగీకరించాయి. ఈ నేపథ్యంలో ఆ రెండు బిల్లులపై కేంద్ర ప్రభుత్వం మద్దతు కోరేందుకు అపాయింట్మెంట్ ఇవ్వాలని ముఖ్యమంత్రి(Revanth Reddy) లేఖలో పేర్కొన్నారు.