Peddapalli | తెలంగాణలో మరో పరువు హత్య కలకలం రేపుతోంది. ఓ తండ్రి తన కూతురిని ప్రేమించాడన్న కారణంగా యువకుడిని గొడ్డలితో కిరాతకంగా నరికి చంపాడు. పుట్టినరోజు నాడే యువకుడు మృతి చెందడం కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచింది. యువకుడి కోసం సదరు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే…
పెద్దపల్లి జిల్లా(Peddapalli) ఎలిగేడు మండలం ముప్పిరితోట గ్రామానికి చెందిన పూరెల్ల సాయికుమార్.. అదే గ్రామానికి చెందిన ఓ యువతి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. కులాలు వేరు వేరు కావడంతో యువతి తండ్రి వీరి ప్రేమకు అడ్డు చెప్పాడు. ఇక నుంచి అమ్మాయితో మాట్లాడొద్దని సాయికుమార్ను హెచ్చరించాడు. కానీ.. అమ్మాయి, అబ్బాయి ఇద్దరూ మాట్లాడుకుంటూనే ఉండటంతో.. ఆగ్రహంతో రగిలిపోయి, ఎలాగైనా యువకుడి అడ్డు తొలగించాలని అమ్మాయి తండ్రి భావించాడు.
ఈ క్రమంలో గ్రామంలోని వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద గురువారం రాత్రి పది గంటల సమయంలో సాయికుమార్ తన స్నేహితులతో కూర్చుని వారితో మాట్లాడుతుండగా.. అదే సమయంలో అమ్మాయి తండ్రి గొడ్డలితో అక్కడికి చేరుకున్నాడు. ఒక్కసారిగా గొడ్డలితో విచక్షణారహితంగా సాయి కుమార్ పై దాడి చేయడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. అతని స్నేహితులు, కుటుంబసభ్యులు, సాయికుమార్ ను హుటాహుటిన సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అక్కడ వైద్యం అందిస్తుండగానే సాయికుమార్ మృతి చెందాడు.