వివాహేతర సంబంధాల(Extramarital Affair) కారణంగా కొందరు దారుణాలకు ఒడిగడుతున్నారు. ఎంతోమంది ప్రాణాలను బలిగొంటున్నారు. కట్టుకున్న భర్తని, భార్యని, తల్లిదండ్రుల్ని, తోబుట్టువుల్ని… ఆఖరికి కడుపున పుట్టిన బిడ్డల్ని కడతేర్చడానికి కూడా వెనుకాడట్లేదు. వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్న వారిని శిక్షించాలని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్స్ పెరుగుతున్న వేళ ఢిల్లీ హైకోర్టు(Delhi High Court) సంచలన వ్యాఖ్యలు చేసింది. వివాహేతర సంబంధం నేరం కాదని పేర్కొంది. ఓ వివాహేతర సంబంధం కేసు విచారణలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేసింది.
వివరాల్లోకి వెళితే.. ఒక వ్యక్తి తన భార్య ప్రియుడిపై కేసు వేశాడు. ఈ కేసు నుంచి ఏప్రిల్ 17న ప్రియుడికి ఢిల్లీ హైకోర్టు విముక్తి కలిగించింది. వివాహేతర సంబంధం నేరమంటూ ఇచ్చిన ఐపీసీ 497వ సెక్షన్ రాజ్యాంగబద్ధం కాదని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ గుర్తు చేశారు. వివాహేతర సంబంధం(Extramarital Affair) నైతికతకు సంబంధించిన అంశమనీ, దాన్ని నేరంగా చూడకూడదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడాన్ని ఆమె గుర్తుచేశారు.
ప్రస్తుత కేసులో తన భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని, వారిద్దరూ ఓ హోటల్లో శారీరకంగా దగ్గరయ్యారని మహిళ భర్త ఆరోపించాడు. ఈ కేసులో ప్రియుడిని మేజిస్ట్రేట్ కోర్టు విడిచిపెట్టగా ఆ తీర్పును సెషన్స్ కోర్టు కొట్టివేసి, ప్రియుడికి సమన్లు పంపింది. దీన్ని ప్రియుడు ఢిల్లీ హైకోర్టులో సవాలు చేయగా వివాహేతర సంబంధం నేరం కాదు అంటూ అతనికి అనుకూలంగా తీర్పు వచ్చింది.