ఇలా చేస్తే మనదే అధికారం..టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

0
91

తెలంగాణ: ఇందిరా భవన్ లో ప్రారంభమైన డిజిటల్ మెంబెర్షిప్ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ నియోజక వర్గాల వారిగా డిజిటల్ మెంబెర్షిప్ ప్రగతిపైన సమీక్ష నిర్వహించారు. ఈ నియోజకవర్గాల కో ఆర్డినెటర్ల సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాస్ కృష్ణన్, ఎమ్మెల్యే సీతక్క, వర్కింగ్ ప్రసిడెంట్స్ మహేష్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, హర్కర వేణుగోపాల్, మల్లు రవి, దీపక్ జాన్, చిన్నారెడ్డి, నిరంజన్, వేం నరేందర్ రెడ్డి, సోహైల్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..పార్టీ సంస్థాగతంగా మరింత బలోపేతం అవ్వాలి. సుమారు 34 వేల బూత్ లలో బూత్ కు వంద మంది సభ్యులను సభ్యత్వం చేయించాలి. ఏఐసీసీ ఆదేశాల మేరకు పార్టీ సభ్యత్వం క్రియాశీలకంగా తీస్కొని పని చేయాలి. సకాలంలో, నిర్దిష్టమైన లక్ష్యాన్ని అధిగమనించి పని చేయాలి. ఆలస్యమైన ప్రాంతాలలో ఎన్ రోలర్ నియామకం వెంటనే చేపట్టి వేగంగా మెంబెర్షిప్ చేపట్టాలి. మంచిగా సభ్యత్వం చేయించిన నాయకులకు పార్టీలో భవిష్యత్ లో గుర్తింపు ఉంటుంది.

దేశానికి డిజిటల్ మెంబెర్షిప్ తెలంగాణ ఆదర్శంగా ఉండాలి. కష్టపడి పని చేస్తే అధికారంలోకి వస్తాము. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. కష్ట పడి చేసే వారికి పదవులు తప్పకుండా వస్తాయి. పార్టీ మెంబెర్షిప్ చేసే విషయంలో నిర్లక్ష్యం చేస్తే ఎంతటి వారైనా నష్టపోతారు. ఎవరు ఎలా మెంబెర్షిప్ చేస్తున్నారో ఏఐసీసీ అధినేతల వద్ద రోజు వారీ సమాచారం ఉంటుంది. మనం క్షేత్ర స్థాయిలో బలంగా ఉంటేనే కొట్లాడగలం అని దిశానిర్దేశం చేశారు.

అలాగే పార్టీని బలోపేతం చేసేందుకు మండలాలను ప్రాతిపదికగా తీసుకుని పని చేయాలని మెంబెర్షిప్ కో ఆర్డినెటర్స్ కు రేవంత్ రెడ్డి సూచించారు. 5 మండలాలలో పార్టీ బలంగా ఉంటే అసెంబ్లీ గెలుస్తాం. 35 మండలాలలో బలంగా ఉంటే ఎంపీ స్థానం గెలుస్తాం. 600 మండలాలలో పార్టీ బలపడితే రాష్ట్రంలో అధికారంలోకి వస్తాం. మండలాలలో అధ్యక్షులు సరిగా పని చేయకపోతే వారిపై చర్యలు తప్పవు. మండలంలో 10 వేలు, నియోజకవర్గంలో 50 వేలు, పార్లమెంట్ నియోజక వర్గంలో 3.5 లక్షల మెంబెర్షిప్ చేయిస్తే వారికి రాహుల్ గాంధీతో సన్మానం చేయిస్తా.

రేపు అసెంబ్లీ ఇంచార్జి లతో మెంబెర్షిప్ పైన సమావేశం ఉంది. 30వ తేదీన ప్రత్యేకంగా ఒక్కో పార్లమెంట్ల వారిగా మెంబెర్షిప్ పైన సమీక్ష చేస్తాం. ఆ లోపు నియోజక వర్గాల వారిగా, మండలాల వారిగా పార్లమెంట్ ఇంఛార్జీలు సమావేశం ఏర్పాటు చేసి ప్రగతి నివేదిక ఇవ్వాలన్నారు రేవంత్ రెడ్డి.