ప్రారంభమైన ఆత్మకూర్ ఉపఎన్నిక పోలింగ్..బరిలో 14 మంది

0
80

ఏపీ మంత్రి మేకపాటి గౌత‌మ్ రెడ్డి హఠాన్మారణంతో ఏపీలోని నెల్లూరు జిల్లా ఆత్మ‌కూరు అసెంబ్లీకి ఉప ఎన్నిక‌ అనివార్యమైంది. ఈ ఉప ఎన్నికకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ జరగనుండగా..పోలింగ్ కోసం 279 కేంద్రాల ఏర్పాటు చేశారు.

వైకాపా తరఫున మేకపాటి విక్రమ్‌రెడ్డి, భాజపా తరఫున జి.భరత్‌కుమార్‌ యాదవ్‌, మరో 14 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 2,13,400 మంది ఓటర్లు ఓటు వేయనున్నారు. ఈ నెల 26వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది.మొత్తం సుమారు రెండు వేల మంది పోలీసు సిబ్బందిని ఈ ఎన్నికల పర్యవేక్షణకు సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు.

ఇదిలా ఉంటే… గౌత‌మ్ రెడ్డి మ‌ర‌ణంతో జ‌రుగుతున్న ఈ ఉపఎన్నిక‌లో వైసీపీ త‌న అభ్య‌ర్థిగా గౌత‌మ్ రెడ్డి సోద‌రుడు మేక‌పాటి విక్ర‌మ్ రెడ్డినే బ‌రిలోకి దించింది. దీంతో సంప్ర‌దాయాన్ని గౌర‌విస్తూ ఉప ఎన్నిక పోటీకి టీడీపీ దూరంగా ఉండిపోయింది. ఈ క్ర‌మంలో వైసీపీ అభ్యర్థితో పాటు బీజేపీ స‌హా మొత్తం 14 మంది ఈ ఎన్నికల బ‌రిలో నిలిచారు.