మునుగోడు ప్రజలను సీఎం మరోసారి మోసం చేశారు..కేసీఆర్ పై పీసీసీ చీఫ్ రేవంత్ ఫైర్

0
59

మునుగోడులో జరిగిన ప్రజా దీవెన సభలో సీఎం కేసీఆర్‌ ప్రసంగంపై టీపీసీసీచీఫ్ రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సభలో కేసీఆర్ మునుగోడు సమస్యలను, నిరుద్యోగంపై మాట్లాడకుండా  ప్రజలను వంచించే ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధి, ప్రాజెక్టులపై మాట్లాడకుండా.. జాతీయ, అంతర్జాతీయ అంశాలపై మాట్లాడారని ఆయన మండిపడ్డారు.

”నిన్నటి సభలో సీఎం కేసీఆర్​ మునుగోడుకు ఏం చేశారో.. ఏం చేస్తారో చెప్పలేదు. జాతీయ రాజకీయాలు చెప్పి మళ్లీ వంచించే ప్రయత్నం చేశారు. రాజగోపాల్ రెడ్డి కోట్ల రూపాయలు కేసీఆర్​కు సహాయం చేసినట్లు చెప్పారు. ఇద్దరి మధ్య ఉన్న రహస్య ఒప్పందం ఏంటి? ఎందుకు సహాయం చేశారు. దానిని రాజగోపాల్ రెడ్డి ఇన్​కమ్​ట్యాక్స్ లెక్కల్లో చూపెట్టారా. రాజగోపాల్ రెడ్డి ఆరోపణలపై కేసీఆర్ వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎప్పటిలోగా డిండి ప్రాజెక్టు పూర్తి చేస్తారో చెప్పలేదు. పోడు భూముల సమస్యను ఎలా తీరుస్తారో చెప్పలేదు. చర్లగూడెం, కిస్టరాయపల్లి భూ నిర్వాసితుల సమస్యను ప్రస్తావించలేదు. ఈడీ, సీబీఐల మీద మాట్లాడారు. పార్టీ ఫిరాయింపులకు ఆద్యులు కేసీఆరే.. భాజపాకు మీరే ఆదర్శం. పార్టీల విలీనానికి కిటికీలు తెరిచింది మీరు. ఏకలింగంగా ఉన్న భాజపాను మూడు తోకలు చేసింది నువ్వే కదా. లేని భాజపాను ప్రత్యామ్నాయంగా సృష్టించింది నీవు కాదా. తెలంగాణపై భాజపా ముప్పేట దాడికి కారణమే కేసీఆర్ అని రేవంత్ పేర్కొన్నారు.