Pawan Kalyan | వైసీపీ వలలో చిక్కుకోవద్దు.. కాపు పెద్దలకు పవన్ కల్యాణ్‌ రిక్వెస్ట్..

-

జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) కాపు పెద్దలకు బహిరంగ లేఖ రాశారు. వైసీపీకి ఓటమి కళ్లెదుట కనిపిస్తోందని.. అందుకే కొందరు కాపు పెద్దలను రెచ్చగొడుతోందని లేఖలో పేర్కొన్నారు. కుట్రలు, కుయుక్తులతో అల్లిన వైసీపీ(YCP) వలలో చిక్కుకోవద్దని సూచించారు. తాను గౌరవించే కాపు పెద్దలు తనను తిట్టినా దీవెనలుగానే భావిస్తాను అని వెల్లడించారు.

- Advertisement -

లేఖలోని అంశాలు..

“రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి ఓటమి అనివార్యమని స్పష్టంగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం తాము వైసీపీని సాగనంపుతున్నామని సర్వేల ద్వారా వెల్లడిస్తూనే ఉన్నారు. ఎమర్జెన్సీ సమయంలో అప్పటి పాలక పక్షాన్ని నిలువరించి దేశ ప్రయోజనాల కోసం అన్ని పార్టీలు ఏకతాటిపైకి వచ్చాయి. అదే రీతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అని ప్రకటించి నేను మొదలుపెట్టిన ఒక కార్యాచరణ వైసీపీకీ, ఆ పార్టీని నడిపే నాయకుడికీ కంటగింపుగా మారింది.

అన్ని సామాజిక వర్గాల్లోనూ నిర్దిష్టమైన శాతం, కాపు సామాజిక వర్గంలో బలమైన శాతం జనసేన(Janasena)కు అండగా ఉండటం వైసీపీకి జీర్ణం కావడం లేదు. ఈ క్రమంలోనే కులపరమైన అస్త్రాన్ని వైసీపీ ప్రయోగిస్తోంది. అందులో భాగంగా నేను గౌరవించే కాపు పెద్దలను రెచ్చగొట్టి పార్టీని బలహీనపరచే దుష్ట ప్రయత్నాలకు ఒడిగడుతోంది. సదరు కాపు పెద్దలు ఆ విధంగా మాట్లాడటానికి వారి కారణాలు వారికి ఉండవచ్చు. వాటిని నేను సహృదయంతో అర్థం చేసుకోగలను. వారి దూషణలను నేను(Pawan Kalyan) దీవెనలుగా తీసుకొంటాను అని తెలియచేస్తున్నాను.

రాష్ట్ర విస్తృత ప్రయోజనాలను కాంక్షిస్తూ నేను తీసుకొనే నిర్ణయాలకు సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. జనసేన ఆవిర్భావం నుంచీ నేటి వరకూ ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాల కోసమే అడుగులు వేస్తున్నాను అని అందరికీ తెలుసు. కులాలను కలిపే ఆలోచనా విధానంతోనే అందరూ ఒక తాటిపైకి రాగలరని విశ్వసిస్తాను. అన్ని కులాలను కలుపుకొని అడుగులు వేసే సమర్థత కాపులకు ఉంది కాబట్టే పెద్దన్న పాత్ర తీసుకోవాలని కోరాను. అందుకు అనుగుణంగా కాపు యువత, మహిళలు, విజ్ఞులు నడుం బిగించారు.

రాబోయే ఎన్నికల్లో కాపులు కచ్చితంగా నిర్ణయాత్మక, క్రియాశీలక పాత్ర పోషిస్తారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించారు. కాబట్టే కాపులలో అంతర్గత విభేదాలు తీసుకువచ్చే క్రమంలోనే వైసీపీ కుట్రలకు తెర తీసింది. కొందరు కాపు పెద్దలను జనసేనపైకి ప్రయోగిస్తోంది. కాపు రిజర్వేషన్ పోరాటాన్ని హింసాత్మకంగా మార్చిన మాస్టర్ క్రిమినల్ బ్రెయిన్ ఆ తరవాత ఎటు మళ్లిందో కాపు సామాజిక వర్గం గ్రహించింది. కాపులకు రిజర్వేషన్ ఇచ్చేది లేదు అని కాపులకు బలమైన జిల్లా అని అందరూ భావించే తూర్పుగోదావరి వెళ్ళి జగ్గంపేటలో కరాఖండీగా ప్రకటించిన శ్రీ జగన్ రెడ్డిని కాపు పెద్దలు ప్రశ్నించాలి. కాపులను కాపు నాయకులతో తిట్టిస్తూ, తూలనాడిస్తున్న వ్యక్తిని కాకుండా నన్ను దూషించడం వల్ల ఎవరికి ప్రయోజనమో గ్రహించాలి.

కుట్రలు, కుతంత్రాలతో అల్లిన వైసీపీ వలలో చిక్కుకోవద్దని నేను గౌరవించే కాపు పెద్దలకు సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. నన్ను దూషించే సదరు కాపు పెద్దలకు జనసేన పార్టీ వాకిలి ఎప్పుడూ తెరిచే ఉంటుందని తెలియచేస్తున్నాను. వైసీపీ ప్రాయోజిత విషపూరిత ప్రచారాలను, తప్పుడు అభిప్రాయాలతో కూడిన విశ్లేషణలు, వార్తలను విశ్వసించవద్దని కాపు సామాజిక వర్గంతోపాటు ప్రతి ఒక్కరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిని ఆకాంక్షిస్తూనే నిర్ణయాలు తీసుకొంటాను అని తెలియచేసుకొంటున్నాను” అని తెలిపారు.

Read Also: తండ్రి పోతే కొడుకొచ్చాడు.. ‘యాత్ర 2’ టీజర్ విడుదల..
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YS Jagan: రేవంత్ రెడ్డిపై YS జగన్ తీవ్ర ఆరోపణలు 

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబు మనిషి అంటూ ఏపీ సీఎం...

Chiranjeevi: పిఠాపురంలో ప్రచారంపై చిరంజీవి ఏమన్నారంటే..?

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు మద్దతుగా పిఠాపురం వెళుతున్నాననే ప్రచారంలో వాస్తవం...