ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి(YS Jagan) శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. డీలిమిటేషన్ పై ప్రధానికి కీలక విజ్ఞప్తి చేశారు. లోక్ సభ లేదా రాజ్యసభలో ఏ రాష్ట్రానికి ప్రాతినిధ్యం తగ్గకుండా చూడాలని కోరారు. ముఖ్యంగా సభలోని మొత్తం సీట్ల వాటా పరంగా, డీలిమిటేషన్ కసరత్తును నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. డీలిమిటేషన్ సమస్య తీవ్రత దేశంలోని సామాజిక, రాజకీయ సామరస్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉందని ఆయన లేఖలో హైలైట్ చేశారు. ఏ రాష్ట్రం కూడా ప్రజా సభలో తన ప్రాతినిధ్యంలో ఎలాంటి తగ్గింపును ఎదుర్కోవాల్సిన అవసరం లేని విధంగా రాజ్యాంగాన్ని సవరించాలని ప్రతిపక్ష ఆయన నొక్కి చెప్పారు.
ప్రధానికి జగన్(YS Jagan) రాసిన లేఖలో కీలక అంశాలు:
1.లోక్సభ లేదా రాజ్యసభలో ఇప్పుడున్న సీట్ల పరంగా ఆయా రాష్ట్రాలకు ఉన్న వాటాను కుదించకుండా పునర్విభజన (డీలిమిటేషన్) కసరత్తు చేపట్టాలి.
2.కొన్ని రాష్ట్రాల ప్రాతినిధ్యం సహా, ఆయా రాష్ట్రాల్లోని ప్రజల మనోభావాలను డీలిమిటేషన్ ప్రక్రియ ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున ఈ లేఖ రాస్తున్నట్లు వెల్లడి. అందుకే డీలిమిటేషన్ ప్రక్రియను అత్యంత జాగ్రత్తగా చేయాల్సిన అవసరాన్ని ఆ లేఖలో నొక్కి చెప్పిన శ్రీ వైయస్ జగన్.
3.రాజ్యాంగంలో 84వ రాజ్యాంగ సవరణ ప్రకారం 2026లో డీలిమిటేషన్ ప్రక్రియను చేపట్టాల్సి ఉంది. కాని, దీనికి ముందుగా 2021లో చేపట్టాల్సిన జనాభా లెక్కింపు ప్రక్రియ కోవిడ్ కారణంగా వాయిదా పడింది. 2026 నాటికి జనాభా లెక్కల ప్రక్రియను పూర్తి చేయడానికి ఇప్పటికే అన్ని రకాల చర్యలు తీసుకున్నారు.
4.ఇది జరిగిన వెంటనే డీలిమిటేషన్ ప్రక్రియ జరుగుతుందన్న ఊహ అనేక రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తోంది. ముఖ్యంగా ఈ ప్రక్రియ ద్వారా తమ ప్రాతినిథ్యం తగ్గిపోతుందని దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
5.జనాభా నియంత్రణ కోసం వివిధ రాష్ట్రాలు అనేక విధానాలు అమలు చేశాయి. అయితే వాటి ఫలితాలు ఆయా రాష్ట్రాల్లో వేర్వేరుగా ఉన్నాయి. దీని వల్ల జనాభా పెరుగుదల వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాలుగా ఉంది.
6.దేశవ్యాప్తంగా జనాభా వృద్ధి ఒకే తరహాలో లేదు. అసమతుల్యత ఉంది. దీని వల్ల డీమిలిటేషన్ అంశం విస్తృతస్థాయిలో ఆందోళనకు దారి తీస్తోంది.
7.42 మరియు 84వ రాజ్యాంగ సవరణల ద్వారా ఆయా రాష్ట్రాలకు సీట్ల కేటాయింపును నిలిపేశారు.
8.కాలక్రమేణా అన్ని రాష్ట్రాల్లో జనాభా నియంత్రణ కసరత్తులో భాగంగా ఒకేస్థాయిలో పలితాలు సాధిస్తాయని భావించి ఈ సీట్ల కేటాయింపును నిలిపేశారు. దేశ జనాభాలో ఆయా రాష్ట్రాల వాటా 1971 నాటి స్థాయికి చేరుకుంటుందని భావించారు.
9.కానీ, 2011 జనాభా లెక్కల గణాకాంలను చూస్తే దశాబ్దాల తరబడి జనాభా వృద్ధి, దాని అంచనాలు అన్ని రాష్ట్రాల్లో ఒకేలా లేవని తేలింది. 1971 మరియు 2011 మధ్య 40 సంవత్సరాల్లో దేశ జనాభాలో దక్షిణాది రాష్ట్రాల వాటా తగ్గింది. ఈ 15 సంవత్సరాల్లో మరింత తగ్గిందని మేం నమ్ముతున్నాం.
10.జనాభా నియంత్రణను జాతీయ ప్రాధాన్యతగా తీసుకున్నందున దక్షిణాది రాష్ట్రాలు నిజాయితీగా తమ విధానాలను అమలు చేయడం వల్ల ఈ వాటా తగ్గింది.
11.1971 జనాభా లెక్కల ప్రకారం దక్షిణాది రాష్ట్రాల జనాభా వృద్ధి రేటు 24.08 శాతం అయితే, 2011 జనాభా లెక్కల ప్రకారం దక్షిణాది రాష్ట్రాల జనాభా వృద్ధి రేటు 20.88 శాతం.
12.ఈ నేపథ్యంలో రాష్ట్రాల్లో ఇప్పుడున్న జనాభా లెక్కలను ఆధారంగా చేసుకుని డీలిమిటేషన్ ప్రక్రియ జరిగితే దేశ విధానాల రూపకల్పన సహా శాసన ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాల భాగస్వామ్యం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని మీ దృష్టికి తీసుకు వస్తున్నాను.
13.దామాషా ప్రకారం అన్ని రాష్ట్రాలకు సీట్ల పెరుగుదల అంశాన్ని దృష్టిలో ఉంచుకుని డీలిమిటేషన్ కసరత్తు చేపడతామని హోం మంత్రి అమిత్షా హామీ ఇచ్చినందుకు కృతజ్ఞతలు. అయితే దీని కోసం రాజ్యంపరంగా చేయాల్సిన సడలింపును కూడా మీ దృష్టికి తీసుకు వస్తున్నాను.
14.భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 81 (2) (ఎ) ప్రకారం జనాభా ప్రాతిపదికన ఆయా రాష్ట్రాలకు సీట్ల కేటాయింపు జరగాలని పేర్కొంది. దీని ప్రకారం డీమిలిటేషన్ ప్రక్రియలో ముందుకు వెళ్తే ఈ నిబంధన హోంమంత్రి అమిత్షా ఇచ్చిన హామీని అమలులో అడ్డంకులు ఏర్పడతాయి.
15.అందువల్ల దామాషా ప్రకారం ప్రతి రాష్ట్రానికి సీట్ల కేటాయింపుపై రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం ఉంది. దీని వల్ల సీట్లలో ఆయా రాష్ట్రాల వాటాలు అలానే ఉంటాయి, ఆయా రాష్ట్రాల ప్రాతినిథ్యం తగ్గుతుందనే అంశం ఉత్పన్నం కాదు.
16.డీలిమిటేషన్ ప్రక్రియపై వస్తున్న అభ్యంతరాలు దేశ సామాజిక, రాజకీయ సామరస్యాన్ని దెబ్బ తీసే అవకాశం ఉన్నందున ఈ అంశం తీవ్రతను దృష్టిలో ఉంచుకోవాలని కోరుతున్నాను. ఈ విషయంలో ప్రధానిగా మీ నాయకత్వం, మార్గనిర్దేశం చాలా ముఖ్యం. మీరిచ్చే హామీ అనేక రాష్ట్రాలకున్న భయాలను, అపోహలను తొలగించడానికి దోహదపడుతుంది.