బెంగళూరులో(Bengaluru) దారుణం చోటుచేసుకుంది. భార్యని చంపి, సూట్ కేసులో పెట్టిన ఘటన సంచలనంగా మారింది. ఈ కేసులో నిందితుడు ఆమె భర్తే అని నిర్ధారించుకున్న పోలీసులు ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న నిందితుడు మహారాష్ట్రలో ఉన్నాడని పోలీసులు నిర్ధారించుకున్నారు. అతన్ని పట్టుకునేందుకు మహారాష్ట్ర పోలీసులతో సమన్వయం చేసుకున్నారు. పూణే సమీపంలో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అప్పటికే అతను ఆత్మహత్య చేసుకునేందుకు పురుగుల మందు సేవించడంతో ఆసుపత్రికి తరలించారు.
దర్యాప్తు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగుళూరులో(Bengaluru) సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్న రాకేష్(36).. ఇంట్లోనే తన 32 ఏళ్ల భార్య గౌరీ రాజేంద్ర ఖేడ్కర్ ని కడుపులో పొడిచి, గొంతు కోసి చంపేశాడు. ఆ తర్వాత ఆమె కాళ్లను మడిచి, శవాన్ని ట్రాలీ బ్యాగ్ లో పెట్టాడు. ఇంటిని ఫినైల్ తో శుభ్రం చేసిన తర్వాత బ్యాగ్ ను బాత్రూమ్ దగ్గర ఉంచి పారిపోయాడు. గురువారం ఈ దారుణమైన నేరం వెలుగులోకి వచ్చింది. హత్య చేసిన తర్వాత నిందితుడు తన భార్య ఆత్మహత్య చేసుకుందని సమీపంలో నివసిస్తున్న వడ్రంగులకు చెప్పాడు. ఆ తర్వాత పోలీసు కంట్రోల్ రూమ్ కి, తన ఇంటి యజమానికి, తన భార్య తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు.
అతను పరారీలో ఉన్నప్పుడు కాల్స్ చేస్తూనే ఉండటంతో, పోలీసులు కంట్రోల్ రూమ్ లో అందుబాటులో ఉన్న కాంటాక్ట్ నంబర్ను ఉపయోగించి అతనిని ట్రాక్ చేయగలిగారు. వారు మహారాష్ట్ర పోలీసులతో సమన్వయం చేసుకుంటూ అతనితో కమ్యూనికేషన్లో ఉన్నారు. పూణే(Pune) లో రాకేష్ ని పట్టుకుని ఆసుపత్రికి తరలించారు.
అయితే ఉద్యోగం విషయంలోనే ఈ దంపతులు ఇద్దరి మధ్య తరచూ గొడవలు అవుతూ ఉండేవని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. గౌరీ ఉద్యోగం తెచ్చుకోలేదని కోపంతో రాకేష్ ఆమెను చెంప దెబ్బ కొట్టాడని, దీంతో కోపంలో గౌరీ అతనిపై కత్తి విసిరింది. గాయం అవ్వడంతో ఆగ్రహానికి లోనైన రాకేష్ కత్తితో ఆమె గొంతు కోసి, కడుపులో పొడిచి కిరాతకంగా చంపినట్లు విచారణలో వెల్లడైంది. రాకేష్ పై కేసు నమోదు చేసిన పోలీసులు, గౌరీ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మరోవైపు 24 గంటల్లోనే కేసును చేదించి నిందితుడిని పట్టుకున్నందుకు బెంగళూరు డీసీపీ సారా ఫాతిమా టీమ్ పై ప్రశంసలు వెలువెత్తుతున్నాయి. బెంగళూరు పోలీసులకు సహకరించినందుకు మహారాష్ట్ర పోలీసులకు అభినందనలు తెలుపుతున్నారు.