తెలంగాణలో యువకుడి దారుణ హత్య..ప్రేమే కారణమా?

0
66

ఆ ఇద్దరు ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే వీరి ప్రేమకు అమ్మాయి సోదరులు ఒప్పుకోలేదు. దీనితో అబ్బాయి కుటుంబం మకాం మార్చింది. కానీ ఆ ఇద్దరి మధ్య దూరం మాత్రం తగ్గలేదు. కానీ ఇంతలో పెను విషాదం. ఆ యువకుడు దారుణ హత్యకు గురై రక్తపు మడుగులో పడి ఉన్నాడు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది.

సూర్యాపేటకు చెందిన కోటయ్య, లక్ష్మీ దంపతుల కుమారుడు దిలీప్ ఎలక్ట్రికల్ డిప్లొమా రెండో ఏడాది చదువుతున్నాడు. తాళ్లగడ్డలో దిలీప్ కుటుంబం నివాసముండేది. ఆ ప్రాంతానికి చెందిన అమ్మాయితో అతనికి పరిచయం ఏర్పడంది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అయితే వీరి ప్రేమకు అమ్మాయి సోదరులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ సోదరిని ప్రేమించవద్దంటూ దిలీప్ కు వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాత దిలీప్ కుటుంబం తాళ్లగడ్డ నుంచి జనగామ క్రాస్ రోడ్డుకు మకాం మార్చింది. అయినా వాళ్ళిద్దరి మధ్య ప్రేమ కొనసాగుతూనే ఉంది.

ఈ క్రమంలో ఆదివారం రాత్రి 9 గంటలకు బయటకు వెళ్లిన దిలీప్ ఇంటికి రాలేదు. తెల్లవారేసరికి పట్టణంలోని మినీ ట్యాంక్ బండ్ చౌదరి చెరువు కట్టపై విగత జీవిగా మారిపోయాడు. గుర్తుతెలియని వ్యక్తులు దిలీప్ కత్తులతో దాడి చేసి గొంతులో పొడిచి హత్య చేశారు. రక్తపు మడుగులో మృతదేహం పడి ఉంది. తెల్లవారుజామున వాకింగ్ కోసం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రేమ వ్యవహారమే తమ కొడుకుని పొట్టన పెట్టుకుందని మృతుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.