ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్(Bhupesh Baghel) నివాసంలో సోమవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) దాడులు నిర్వహించింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఈ పరిణామంపై స్పందిస్తూ, కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్(Manickam Tagore) కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాజకీయ ప్రయోజనాల కోసం EDని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు.
“ఈడీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(PM Modi), కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) పెంపుడు కుక్కగా మారిందని మనందరికీ తెలుసు. వారు ఈ కుక్కను ఎక్కడికైనా పంపవచ్చు” అని ఠాగూర్(Manickam Tagore) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బాఘేల్ అనేక రాజకీయ పోరాటాలు చేసిన బలమైన కాంగ్రెస్ నాయకుడని ఆయన అన్నారు. “కాంగ్రెస్ పార్టీ, ఛత్తీస్గఢ్ ప్రజలు ఆయనతో ఉన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ నిర్మించిన ఈ నకిలీ కథనాలు ఓడిపోతాయని మనందరికీ తెలుసు” అని ఆయన అన్నారు. కాగా, కేంద్ర సంస్థలను బీజేపీ రాజకీయ ప్రతీకార చర్యలకు ఉపయోగిస్తోందని ప్రతిపక్ష పార్టీలు పదే పదే ఆరోపిస్తుండటంతో.. అధికార బీజేపీ, కాంగ్రెస్ మధ్య రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈడీ మరోసారి ప్రతిపక్ష నేత ఇంట రైడ్స్ చేయడం రాజకీయంగా చర్చకి దారి తీసింది. ఈడీని పెంపుడు కుక్క అంటూ కాంగ్రెస్ ఎంపీ ఠాగూర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది.