ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) రెండు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం మారిషస్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మారిషస్(Mauritius) దేశ జాతీయ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరవుతారు. అలాగే ఆ దేశ అగ్ర నాయకులతో సమావేశమవుతారు. మారిషస్ ప్రధాని నవీన్ రామ్ గులం(Navin Ramgoolam) ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి మోదీ పర్యటన సందర్భంగా… సామర్థ్య నిర్మాణం, వాణిజ్యం, సరిహద్దు ఆర్థిక నేరాలను ఎదుర్కోవడం వంటి రంగాలలో సహకారాన్ని అందించే అనేక ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకం చేస్తాయి.
కాగా, సోమవారం మారిషస్కు బయలుదేరే ముందు తన పర్యటన రెండు దేశాల మధ్య సంబంధాలలో “నూతన, ప్రకాశవంతమైన” అధ్యాయాన్ని ప్రారంభిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. ఈ పర్యటనలో మారిషస్ అధ్యక్షుడిని, ప్రధానమంత్రిని మోదీ కలుస్తారు. ద్వీప దేశంలోని సీనియర్ ప్రముఖులు, రాజకీయ పార్టీల నాయకులతో సమావేశాలు నిర్వహిస్తారు. ఆ దేశంలో ఉంటున్న ఇండియన్ సొసైటీ మెంబర్స్ తో కూడా సంభాషించనున్నారు. ఇండియా గ్రాంట్ సహాయంతో నిర్మించిన సివిల్ సర్వీస్ కళాశాల, ఏరియా హెల్త్ సెంటర్ ని మోదీ ప్రారంభిస్తారు. బుధవారం జరిగే వేడుకల్లో భారత నావికాదళ యుద్ధనౌక, భారత వైమానిక దళానికి చెందిన ఆకాశ్ గంగా స్కై డైవింగ్ బృందంతో పాటు భారత సాయుధ దళాల బృందం పాల్గొంటుంది.
తన పర్యటన సందర్భంగా “మారిషస్ ఇండియాకి దగ్గరి సముద్ర పొరుగు దేశం. హిందూ మహాసముద్రంలో కీలక భాగస్వామి. అలాగే ఆఫ్రికన్ ఖండానికి ప్రవేశ ద్వారం. చరిత్ర, భౌగోళికం, సంస్కృతి ద్వారా మనం అనుసంధానించబడి ఉన్నాము” అని మోదీ అన్నారు. “లోతైన పరస్పర విశ్వాసం, ప్రజాస్వామ్య విలువలపై ఉమ్మడి నమ్మకం, మన వైవిధ్యాన్ని జరుపుకోవడం మా బలాలు” అని ఆయన అన్నారు. మోదీ(PM Modi) 2015లో మారిషస్ ను సందర్శించారు.
1968లో స్వాతంత్ర్యం పొందిన మాజీ బ్రిటిష్, ఫ్రెంచ్ కాలనీ అయిన మారిషస్ కి అతిపెద్ద వాణిజ్య భాగస్వాములలో భారతదేశం ఒకటి. ఈ ప్రత్యేక సంబంధాలకు ఒక ముఖ్య కారణం, ద్వీప దేశానికి గల 1.2 మిలియన్ల (12 లక్షలు) జనాభాలో దాదాపు 70 శాతం మంది భారతీయ సంతతికి చెందినవారు ఉండటం. ప్రధాన మంత్రి పర్యటనకు ముందు, హిందూ మహాసముద్రంలోని చాగోస్ దీవులపై UKతో పరస్పర ప్రయోజనకరమైన ఒప్పందాన్ని కుదుర్చుకునే ప్రయత్నాలలో ద్వీప దేశానికి మద్దతు ఇస్తున్నట్లు భారతదేశం శనివారం తెలిపింది. మారిషస్ ప్రధాన మంత్రి రామ్ గులంతో మోదీ జరిపే చర్చలలో ఈ అంశం ప్రస్తావనకు వస్తుందని భావిస్తున్నారు. గత ఏడాది అక్టోబర్ లో జరిగిన చారిత్రాత్మక ఒప్పందం ప్రకారం అర్ధ శతాబ్దానికి పైగా కొనసాగిన చాగోస్ దీవుల సార్వభౌమత్వాన్ని మారిషస్కు అప్పగించాలని UK తన నిర్ణయాన్ని ప్రకటించింది.