GHMCలో కంటోన్మెంట్‌ విలీనం..కేంద్ర మంత్రులకు కేటీఆర్ ట్వీట్

Cantonment merges with GHMC..KTR tweet to Union Ministers

0
112
KTR

హైదరాబాద్: ప్రజలకు కనీస వసతులు కల్పించలేకపోతే సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డును గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ)లో విలీనం చేయాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రతిపాదించారు.

కంటోన్మెంట్‌లో రోడ్ల మూసివేతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కేంద్ర ప్రభుత్వం ఎందుకు తగిన చర్యలు తీసుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు. రోడ్ల మూసివేతపై ట్విట్టర్ వేదికగా స్పందించిన కేటీఆర్‌.. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్, కిషన్ రెడ్డిలకు ట్వీట్ చేశారు.

‘‘అక్రమంగా రోడ్ల మూసివేతపై ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్‌ బోర్డు అధికారులు నిబంధనలు ఉల్లంఘిస్తోంటే కేంద్రం ఎందుకు నియంత్రించడం లేదు? కేవలం రెండు రోడ్లను మాత్రమే మూసివేశారంటూ పార్లమెంట్‌లో కేంద్ర రక్షణ శాఖ సహాయమంత్రి అజయ్ భట్ ప్రకటన చేశారు. 2 కాదు 21 రోడ్లు మూసివేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించలేకపోతే జీహెచ్‌ఎంసీలో విలీనం చేసి సమస్యలు పరిష్కరించుకుందాం’’ అని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.