రైతులకు మద్దతుగా కాంగ్రెస్..9 తీర్మానాలకు ఆమోదం

Congress approves 9 resolutions in support of farmers

0
42

హైదరాబాద్​ ఇందిరా పార్కు ధర్నా చౌక్​ వద్ద కాంగ్రెస్​ చేపడుతున్న వరి దీక్షలో..రైతులకు మద్దతుగా 9 తీర్మానాలను ప్రవేశపెట్టారు. వీటిని పార్టీ నేతలు ఏకగ్రీవంగా ఆమోదించారు. కిసాన్ కాంగ్రెస్ నేతలు కోదండరెడ్డి, అన్వేష్ రెడ్డి తీర్మానాలను దీక్షలో ప్రవేశపెట్టారు.

ప్రస్తుత ఖరీఫ్ వరి ధాన్యాన్ని తక్షణమే కొనుగొలు చేయాలి. కొనుగోలు కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి.

తడిసిన ధాన్యాన్ని కూడా ఎలాంటి ఆంక్షలు లేకుండా కొనుగోలు చేయాలి.

ధాన్యం కొనుగోలు వ్యవస్థలో రైస్ మిల్లర్ల ప్రమేయం ఉండకూడదు.

గతేడాది రబీ పంట సేకరణలో జరిగిన అవకతవకల వల్ల రైతుకు భారీగా జరిగిన ఆర్థిక నష్టాల మీద సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలి.

యాసంగి పంటల సాగు విషయంలో ఆంక్షలు పెట్టకూడదు. భూమి స్వభావం, వనరుల అనుకూలతను బట్టి రైతుకు సాగుపై స్వేచ్ఛ ఉండాలి.

మద్దతు ధరల పరిధిలో ఉన్న ప్రధానమైన పంటలను మద్దతు ధరకు తక్కువ కాకుండా కొనుగోలు చేయాలి.

వ్యవసాయ పంటలకు సమగ్ర మద్దతు ధర, కొనుగోలు విషయంలో చట్ట బద్ధత కల్పించాలి.

సమగ్రమైన విత్తన చట్టాన్ని తెచ్చి కల్తీ విత్తనాల బారి నుంచి రైతును కాపాడాలి.

ఏకకాలంలో రూ. లక్ష పంట రుణమాఫీ చేయాలి. ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగిన పంట నష్టం 2020, 21 సంవత్సరాలకు కోర్టు ఆదేశాల ప్రకారం పంట నష్ట పరిహారం వెంటనే రైతులకు చెల్లించాలి.