అప్పటి నుంచి కరోనా ఆంక్షలు ఎత్తివేత..సీఎస్ లకు కేంద్ర హోంశాఖ లేఖ

0
37

దేశంలో కరోనా మహమ్మారి సృష్టించిన అల్లకొల్లోలం అంతాఇంతా కాదు. దీని ప్రభావంతో 2 సంవత్సరాల నుండి దేశంలో పలు ఆంక్షలు అమలవుతున్నాయి. తాజాగా ఈ రాకాసి మహమ్మారి శాంతించింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది.  మార్చి 31 నుంచి కొవిడ్‌ నిబంధనలను పూర్తిగా ఎత్తివేయాలని నిర్ణయించినట్లు వెల్లడించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల సీఎస్ లకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి లేఖ రాశారు.

కొవిడ్‌ కట్టడికి విపత్తు నిర్వహణ చట్టం కింద ఉన్న నిబంధనలు మరింతకాలం పొడగించాల్సిన అసవరం లేదని భావిస్తున్నామని, మార్చి 31న ప్రస్తుతమున్న ఆంక్షల గడువు ముగియనుందని, ఆ తర్వాత హోంశాఖ ఎలాంటి కొత్త ఆదేశాలు జారీ చేయబోదని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా.. రాష్ట్రాలకు పంపిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ప్రజలంతా మాస్క్‌ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని హోంశాఖ సూచించింది. వైరస్‌ తీరు ఎప్పుడు ఎలా ఉంటుందో అంచనా వేయలేం గనుక, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని భల్లా అన్నారు.