324 ప్లాట్లకు హెచ్ఎండిఎ వేలం..పూర్తి వివరాలివే..

0
65

అన్ని రకాలుగా అభివృద్ధి చేసిన ఓపెన్ ప్లాట్లకు హెచ్ఎండిఎ మరో మారు వేలం వేయనుంది. హెచ్ఎండిఎ లిమిట్స్ లోని బహదూర్ పల్లి, తొర్రూర్ పరిసరాల్లో ఉన్న లే అవుట్లలోని 324 ప్లాట్లకు వేలం వేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. ఇందులో బహదూర్ పల్లిలో 101 ప్లాట్లు, తొర్రూర్ లో 223 ప్లాట్లు అమ్మకానికి ఉన్నాయి.

మార్చి మూడో వారంలో ఈ ఆక్షన్ ద్వారా వీటిని విక్రయించనున్నారు. ఖజానా నింపుకోవడమే ఏకైక లక్ష్యంగా తెలంగాణ సర్కారు ప్లాట్ల వేలం చేపట్టిన విషయం తెలిసిందే. ఇదే పరంపర మరింతగా కొనసాగించనున్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు మేడ్చల్ జిల్లాలోని బహదూర్ పల్లి రంగారెడ్డి జిల్లాలోని తొర్రూర్ లోని ప్లాట్లను ఆన్ లైన్ ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎంఎస్టిసి ఆధ్వర్యంలో వేలం ద్వారా అంటే ఈ –ఆక్షన్ ద్వారా విక్రయించేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ(హెచ్ఎండిఏ) సన్నాహాలు పూర్తి చేసింది. మల్టీ పర్పస్ జోన్ కింద ఉన్న ఈ రెండు లే అవుట్లను హెచ్ఎండిఏ పూర్తిస్థాయిలో అభివృద్ది చేయనున్నది.

ఈ విషయమై మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా పరిధిలోని బహదూర్ పల్లిలో 40 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేస్తున్న లే అవుట్ లో 101 పాట్ల విక్రయాలకు సంబంధించి ఫిబ్రవరి 23వ తేదీన ప్రీబిడ్ మీటింగ్ జరుగనున్నది. బహదూర్ పల్లిలో మేకల వెంకటేశ్ ఫంక్షన్ హాల్ లో బుధవారం ఉదయం పదకొండు గంటలకు ప్రీబిడ్ మీటింగ్ ప్రారంభం కానున్నది. అలాగే రంగారెడ్డి జిల్లాలోని తొర్రూర్ లో 117 ఎకరాల విస్తీర్ణంలో హెచ్ఎండిఏ లేఅవుట్ను అభివృద్ధి చేస్తుంది. అందులోని 223 ప్లాట్లను ఈ ఆక్షన్ ద్వారా విక్రయించనున్నారు. దీనికి సంబంధించి ప్రీబిడ్ మీటింగ్ను ఈనెల 25వ తేదీన తోర్రూర్ సైట్ లోనే నిర్వహించనున్నాట్లు హెచ్ఎండిఎ అధికారులు వెల్లడించారు.

ప్రభుత్వ స్థలాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ తెలంగాణ సర్కారు ఖజానా నింపుకునేందుకు భారీ కసరత్తు చేపట్టిందని చెప్పవచ్చు. ఇప్పటికే కోకాపేట, ఉప్పల్ భగాయత్ వెంచర్లలో ప్లాట్లను వేలం వేసి వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం సొమ్ము చేసుకుంది. తాజాగా మరో రెండు వెంచర్లలో ప్లాట్ల అమ్మకానికి తెర తీసింది. ఈ వెంచర్ల ప్లాట్ల విక్రయం ద్వారా కూడా కోట్లాది రూపాయలు సమకూర్చుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.