నిరుద్యోగులకు కేసీఆర్ శుభవార్త..10 వేల పోస్టుల భర్తీకి నిర్ణయం

0
43

తెలంగాణ నిరుద్యోగులకు కేసీఆర్ సర్కార్ శుభవార్త చెప్పింది. సంక్షేమ గురుకుల సొసైటీల్లో రాష్ట్రపతి ఉత్తర్వులు అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనితో పోస్టుల భర్తీకి మార్గం సుగమం అయింది. గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో దాదాపు 10 వేల పోస్టుల భర్తీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

నూతన జోనల్‌ విధానం అమలుపై ప్రభుత్వం నుంచి ఇంకా ఆదేశాలు రాలేదు. అయినా.. కొత్తగా గుర్తించిన పోస్టులతో పాటు గతంలో మంజూరైన వాటి భర్తీకి నూతన జోనల్‌ విధానం మేరకు అనుమతుల కోసం ప్రభుత్వానికి సొసైటీలు ప్రతిపాదనలు పంపించాయి. ఇవి భర్తీ అయితే.. పోలీస్‌శాఖ తరువాత అత్యధిక పోస్టులు గురుకులాల్లోనే ఉంటాయని సమాచారం.

రాష్ట్రంలో 970 గురుకుల పాఠశాలలు ఉన్నాయి. వీటిలో మైనార్టీ, బీసీ సొసైటీల పరిధిలో 485 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో బీసీ గురుకుల సొసైటీ పరిధిలో వివిధ కేటగిరీల్లో 5,387 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మైనార్టీ సంక్షేమ శాఖ పరిధిలో 1,250కు పైగా లెక్చరర్‌ పోస్టులు రానున్నాయి. వీటితో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సొసైటీల్లో గతంలో భర్తీ చేయకుండా మిగిలిపోయిన భాషా పండితులు, పీఈటీలు ఇతర కేటగిరీలకు చెందిన 1,200 పోస్టులు ఉన్నాయి. బోధన సిబ్బంది పోస్టులన్నీ కలిపి 10 వేలకు పైగా ఉన్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే ప్రకటన రానుంది.