’12 నెలలు ఆగితే రాష్ట్రానికి పట్టిన కొరివి దెయ్యం వదిలిస్తం’

'After 12 months, the state will be free of the fireplace ghost'

0
81

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేడు మేడారానికి వెళ్లారు. సమ్మక్క, సారలమ్మ దేవతలను ఆయన దర్శించుకొని, మొక్కులు చెల్లించుకున్నారు. ఇక రోడ్డుమార్గం ద్వారా వెళ్తున్న రేవంత్‌కు ములుగు సమీపంలో భారీ ఎత్తున స్వాగతం పలికారు కాంగ్రెస్‌ శ్రేణులు. అక్కడి నుండి మేడారం చేరుకున్న రేవంత్ ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆధ్వర్యంలో వనదేవతలను దర్శించుకున్నారు.

అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి పార్టీ మారుతున్నారన్న విషయంపై స్పందించారు. జగ్గారెడ్డి విషయం టి కప్పులో తుఫాన్ లాంటిది. కుటుంబంలో కలహాలు ఉన్నట్టే పార్టీలో బేధాభిప్రాయాలు ఉన్నాయి. కాంగ్రెస్ ది భిన్నత్వంలో ఏకత్వం… ప్రాంతీయ పార్టీల్లో ఏకత్వంలో మూర్ఖత్వం. కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం ఎక్కువ.. అన్ని పరిస్థితులు సర్థుకుంటాయి. పోలీసులపై మాట్లాడిన మాటలు ఉద్దేశపూర్వకంగా చేసినవి కావు. ఆవేశంతో అలా మాట్లాడాలి వచ్చింది.. కానీ అలా మాట్లాడకుండా ఉండాల్సిందన్నారు.

సమ్మక్క సారలమ్మల పోరాటమే మాకు స్ఫూర్తి. తెలంగాణ ఉద్యమానికి కూడా సమ్మక్క-సారలమ్మలే స్ఫూర్తి. మేడారం మహాజాతరకు ప్రపంచ గుర్తింపు రావాల్సి ఉన్నా గత పాలకులు పట్టించుకోలేదు. ములుగు జిల్లాకు సమ్మక్క-సారక్క పేరుపెట్టాలి. కేసీఆర్ ప్రభుత్వం మేడారం జాతరను విస్మరించింది

సమ్మక్క పోరాట స్ఫూర్తిని, తెలంగాణ అత్మగౌరవాన్ని కించపరిచారు. సమ్మక్క చరిత్రను కనుమరుగు చేయడానికి కేసీఆర్ కుట్ర చేస్తున్నడు. చిన్నజీయర్ స్వామి, రామేశ్వరరావు నిర్మించిన ఆలయాలకు ఇచ్చిన విలువ.. సమ్మక్క జాతరకు ఇవ్వలేదు. కృత్రిమమైన కట్టడం దగ్గర పొర్లుదండాలు పెట్టిన కేసీఆర్ కుటుంబం…మేడారం జాతరకు ఎందుకు రాలేదు. ముచ్చింతల్ కు వచ్చిన ప్రధాని మోదీ మేడారం ఎందుకు రాలేదు. సీఎం, పీఎం మేడారం జాతరను చిన్నగా చేసి చూపే కుట్ర చేస్తున్నారు.

కాంగ్రెస్, బీజేపీకి ఆదివాసీల ఓట్లే కావాలి. మేడారం మహాజాతరకు జాతీయ గుర్తింపు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్రానికి పంపాలి. ప్రతీ మేడారం మహాజాతరకు 500 కోట్లు కేటాయించాలి. పేదల విశ్వాసాలపట్ల కేసీఆర్ కుటుంబానికి నమ్మకం లేదు. తెలంగాణలో జిల్లాలను కుక్కచింపిన విస్తరిగా మార్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ములుగు జిల్లాకు సమ్మక్క సారక్క పేరుపెడతాం. సీతక్క సంతకంతోనే ములుగు జిల్లాను తీసుకువస్తాం. 12 నెలల తర్వాత తెలంగాణలో సోనియమ్మరాజ్యం వస్తది. ఆ రాజ్యంలో సీతక్కకు ప్రత్యేక గుర్తింపు ఉంటుందని రేవంత్ రెడ్డి తెలిపారు.