ఏపీలో పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రారంభం..

Parishad polls begin in AP

0
70

ఏపీలో మరోసారి వరుస ఎన్నికల హడావిడి మొదలైంది. వివిధ కారణాలతో నిలిచిపోయిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఇవాళ మరోసారి ఎన్నికలు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 10 జెడ్పీటీసీ స్థానాలకు, 123 ఎంపీటీసీ స్థానాలకు నేడు ఎన్నికలు జరుగుతునున్నాయి. కోర్టు కేసులతో సహా వివిధ కారణాలతో నిలిచిపోయిన, ఆయా స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.

ఇవికాకుండా గతంలో ఓట్ల లెక్కింపు సమయంలో తడిసిన ఓట్ల కారణంగా లెక్కింపు ఆగిపోయిన వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగు జెడ్పీటీసీ స్థానంలో రెండు బూత్‌లతో పాటు మరో ఆరు ఎంపీటీసీ స్థానాల్లోనూ పోలింగ్ నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నిలక సంఘం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 14 జెడ్పీటీసీ స్థానాలు, 176 ఎంపీటీసీ స్థానాల ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీ చేసింది ఎస్ఈసీ.

నాలుగు జెడ్పీటీసీ స్థానాలు, 50 ఎంపీటీసీ స్థానాల ఎన్నిక ఏకగ్రీవం అయిన సంగతి తెలిసిందే. మూడు ఎంపీటీసీ స్థానాల్లో ఎవరూ నామినేషన్ల దాఖలు చేయకపోవడంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. మిగిలిన చోట్ల 954 పోలింగ్‌ కేంద్రాల్లో మంగళవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరుగనుంది. జెడ్పీటీసీ స్థానాల్లో 40 మంది, ఎంపీటీసీ స్థానాల్లో 328 మంది పోటీలో ఉన్నారు. మొత్తం 8,07,640 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఓట్లను ఈనెల 18న లెక్కిస్తారు.

రాష్ట్రంలోని 10 జడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. వివిధ కారణాలతో అప్పట్లో ఆగిపోయిన, గెలిచినవారు చనిపోయిన కారణంగా ఆయా స్థానాల్లో ఎన్నికల పోలింగ్‌ జరుగుతోంది.