తెలంగాణ హైకోర్టు నూతన న్యాయ‌మూ‌ర్తుల ప్రమా‌ణ‌స్వీ‌కారం

0
65
Telangana

తెలంగాణ హైకోర్టుకు కొత్తగా నియమితులైన 10 మంది న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు. ఉన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి సతీశ్‌ చంద్ర శర్మ వీరితో ప్రమాణం చేయించారు. మొత్తం 42 మంది న్యాయమూర్తులు ఉండాల్సిన హైకోర్టులో.. ప్రస్తుతం 19 మంది సేవలందిస్తున్నారు. కొత్త న్యాయమూర్తుల నియామకంతో మొత్తం సంఖ్య 29కి చేరుతుంది.

న్యాయమూర్తులు కాసోజు సురేందర్‌, సూరేపల్లి నందా, ముమ్మినేని సుధీర్‌కుమార్‌, జువ్వాడి శ్రీదేవి, ఎన్‌ శ్రవణ్‌కుమార్‌ వెంకట్‌, గుణ్ణు అనుపమ చక్రవర్తి, గిరిజ ప్రియదర్శిని, సాంబశివరావు నాయుడు, అనుగు సంతోష్‌ రెడ్డి, డాక్టర్‌దేవరాజ్‌ నాగార్జునల కొత్తగా నియమితులయ్యారు. మొదటి కోర్టు హాల్‌లో ఈ కార్యక్రమం జరిగింది.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని కొలీజియం న్యాయవాదుల కేటగిరీ నుంచి ఏడుగురు.. న్యాయాధికారుల కేటగిరీ నుంచి అయిదుగురు కలిపి.. మొత్తం 12 మంది పేర్లు సిఫార్సు చేశారు. వీరిలో 10 మంది నియామకాలకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. హైకోర్టులో అయితే ఒకేసారి పదిమంది న్యాయమూర్తులను నియమించడం ఇదే మొదటిసారి కావడం విశేషం.