‘తెలంగాణ విజయ గర్జన పేరుతో భారీ బహిరంగ సభ: కేటీఆర్

Telangana Vijaya Garjana Sabha' on November 15

0
69
KTR

నవంబర్‌ 15న వరంగల్‌లో ‘తెలంగాణ విజయ గర్జన’ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఈనెల 27న రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో దీనికి సంబంధించిన సన్నాహక సభలు నిర్వహిస్తామన్నారు.

తెలంగాణ భ‌వ‌న్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ..టీఆర్ఎస్ పార్టీ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షులు సీఎం కేసీఆర్ ఆదేశాల మేర‌కు పార్టీ సంస్థాగ‌త నిర్మాణ ప్ర‌క్రియ క్షేత్ర‌స్థాయి నుంచి మొద‌లుకొని ప‌ట్ట‌ణ‌, మండ‌ల స్థాయి వ‌ర‌కు క‌మిటీల నిర్మాణం పూర్తయింది. రాష్ట్ర వ్యాప్తంగా 12769 గ్రామాల్లో గ్రామ కమిటీలు, 3600 పైచిలుకు వార్డు క‌మిటీల‌తో పాటు బ‌స్తీ క‌మిటీలు, డివిజ‌న్ క‌మిటీలు, మండ‌ల‌, ప‌ట్ట‌ణ క‌మిటీలు పూర్తి చేశామ‌న్నారు. అనుబంధ సంఘాల నిర్మాణం కూడా పూర్త‌యింద‌ని కేటీఆర్ వెల్ల‌డించారు.

పార్టీ విధివిధానాల ప్ర‌కారం ప్ర‌తి రెండేండ్ల‌కోసారి పార్టీ అద్య‌క్ష ప‌ద‌వి ఉంటుంది. ప్ర‌తి రెండేండ్ల‌కోసారి ఏప్రిల్ 27న అధ్య‌క్షుడిని ఎన్నుకుంటాం. కానీ 2019లో పార్ల‌మెంట్ ఎన్నిక‌ల కార‌ణంగా, 2020, 2021లో క‌రోనా వ్యాప్తి కార‌ణంగా పార్టీ ప్లీన‌రీ నిర్వ‌హించ‌లేదు. ప్ర‌స్తుతం దేశంలోని ఇత‌ర రాష్ట్రాల కంటే తెలంగాణ‌లో క‌రోనా తీవ్ర‌త గ‌గ్గింది. వ్యాక్సినేష‌న్ కూడా వేగంగా జ‌రుగుతంది. నెల రోజుల్లో 100 శాతం వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ పూర్తి కానుంది.

ఈ క్ర‌మంలో పార్టీ అధ్య‌క్ష ఎన్నిక నిర్వ‌హ‌ణ‌కు నిర్ణ‌యం తీసుకున్నాం. హైదరాబాద్ న‌గ‌రంలోని హెచ్ఐఐసీ ప్రాంగ‌ణంలో అక్టోబ‌ర్ 25న పార్టీ జ‌న‌ర‌ల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసి పార్టీ అధ్య‌క్షుడిని ఎన్నుకుంటామ‌ని కేటీఆర్ తెలిపారు. ఆ స‌మావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన‌ 14 వేల మంత్రి ప్ర‌జాప్ర‌తినిధులు పాల్గొన‌నున్నారు. అధ్య‌క్ష‌ ఎన్నిక‌కు సంబంధించి అక్టోబ‌ర్ 17న షెడ్యూల్ విడుద‌ల కానుంది. 22వ తేదీ వ‌ర‌కు నామినేష‌న్ల‌ను స్వీక‌రిస్తారు. 23న నామినేష‌న్ల ప‌రిశీల‌న ఉంటుంది. 24న నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు చివ‌ర‌తీది. 25న జ‌న‌ర‌ల్ బాడీ మీటింగ్‌లో పార్టీ అధ్య‌క్షుడిని ఎన్నుకోనున్నారు. రిట‌ర్నింగ్ ఆఫీస‌ర్‌గా ప్రొఫెస‌ర్ శ్రీనివాస్ రెడ్డి వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. 25న అధ్య‌క్ష ఎన్నిక ముగిసిన అనంత‌రం పార్టీ ప్లీన‌రీ స‌మావేశం కొన‌సాగనుంది. రాష్ట్ర స్థాయి అంశాల‌తో పాటు ఇత‌ర అంశాల‌పై విస్తృత‌మైన చ‌ర్చ కొన‌సాగ‌నుంది. తీర్మానాల క‌మిటీ చైర్మ‌న్‌గా సిరికొండ మ‌ధుసూద‌న‌చారి వ్య‌వ‌హ‌రిస్తారు అని కేటీఆర్ తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా పార్టీని ఏర్పాటు చేసి, అనేక సవాళ్లను ఎదుర్కొని తెలంగాణ ప్రజల కలలను సాకారం చేస్తూ, స్వరాష్ట్రాన్ని సాధించిన పార్టీగా టీఆర్ఎస్ నిలిచింద‌ని టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఆ త‌ర్వాత అద్భుతమైన విధానాలతో పరిపాలన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న నేపథ్యాన్ని పురస్కరించుకొని పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాలను నవంబర్ 15వ తేదీన వరంగల్‌లో నిర్వహిస్తామ‌ని టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. తెలంగాణ విజయ గర్జన పేరుతో జరిగే ఈ సమావేశానికి పార్టీ శ్రేణులు భారీగా హాజరు కావాల‌ని పిలుపునిచ్చారు.

పార్టీ గ్రామ, వార్డు, మండల, పట్టణ, డివిజన్ కమిటీలు, ఆయా అనుబంధ కమిటీల సభ్యులతో పాటు పార్టీ కార్యకర్తలు హాజరు కావాల‌న్నారు. లక్షలాదిగా తరలిరావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ విజయ గర్జన బహిరంగ సభ సన్నాహక సమావేశాలను ప్రతి నియోజకవర్గంలో అక్టోబర్ 27న‌ నిర్వహించడం జరుగుతుందని కేటీఆర్ పేర్కొన్నారు. నియోజకవర్గంలోని కార్యకర్తలతో ఈ సన్నాహక సమావేశాన్ని అన్ని నియోజకవర్గాల్లో ఒకటే రోజు నిర్వహించనున్నాం అని కేటీఆర్ తెలిపారు.