బంగాళాఖాతంలో భారీగా పెరుగుతున్న ‘అసని’ తుపాను తీవ్రత.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూహెచ్చరిక

0
71

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ బంగాళాఖాతంలో ‘అసని’ తీవ్ర తుపాను గురించి అన్ని వివరాలను తెలియజేసారు. గడిచిన 6 గంటల్లో గంటకు 25 కి.మీ వేగంతో పశ్చిమవాయువ్య దిశగా కదులుతున్నట్టు తెలిపారు. అంతేకాకుండా ప్రస్తుతం కాకినాడకు 210 కి.మీ, విశాఖపట్నంకు 310 కి.మీ, గోపాలపూర్ కు 530 కి.మీ, పూరీకు 630 కి.మీ దూరంలో ఉన్నట్టు వెల్లడించారు.

ఇది వాయువ్య దిశగా పయనించి రేపు ఉదయంకు కాకినాడ -విశాఖపట్నం తీరాలకు దగ్గరగా చేరుకునే అవకాశం ఉందని తెలిపారు. అనంతరం దిశమార్చుకుని ఉత్తర-ఈశాన్య దిశగా కదులుతూ ఉత్తరాంధ్ర మరియు ఒడిశా తీరాలకు దూరంగా వాయువ్య బంగాళాఖాతంలోకి వెళ్ళే అవకాశం ఉంది. ఆ తరువాత  తదుపరి 12గంటల్లో క్రమంగా తీవ్రతుపాను నుంచి తుపానుగా బలహీనపడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

ఈ రోజురాత్రి నుంచి ఉమ్మడి కోస్తాంధ్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతి భారీవర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల సంస్థ వెల్లయించింది. రేపు ఉత్తరాంధ్రలో వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 75-95 కిమీ వేగంతో ఈదురగాలులు వీస్తాయి. SDRF, NDRF బృందాలు సహాయక చర్యలకు అన్ని ఏర్పాట్లు చేసారు. దాంతో పాటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కోరారు. తుపాను ముంచుకొస్తున్న నేపథ్యంలో కోస్తాంధ్ర జిల్లా యాత్రాంగాలని విపత్తుల సంస్థ అప్రమత్తం చేసింది. అంతేకాకుండా సముద్రాలలో అలలు వస్తున్న కారణంగా మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని హెచ్చరించారు.