ఆత్మగౌరవంలోనే కాదు.. త్యాగంలోనూ పద్మశాలీలు ముందుంటారని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన పదవిని త్యాగం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీనే ఇందుకు నిదర్శనం అని ఆయన చెప్పారు. ఆదివారం హైదారాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన అఖిలభారత పద్మశాలి మహాసభకి(Akhila Bharatha Padmashali Mahasabha) సీఎం రేవంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం పురుడుపోసుకునేందుకు కొండా లక్ష్మణ్ బాపూజీ(Konda Laxman Bapuji) తన సొంత ఇంటినే వేదిక చేసిన వ్యక్తి అని కొనియాడారు. అలాంటి వ్యక్తి మరణిస్తే గత ప్రభుత్వం నివాళులు అర్పించని సంఘటనను పద్మశాలి సమాజం మరిచిపోలేదని అన్నారు.
తెలంగాణ ఉద్యమంలో ముందున్న మరో వ్యక్తి టైగర్ ఆలే నరేంద్ర అని సీఎం తెలిపారు. ఆయనను కాంగ్రెస్ పార్టీ కేంద్ర మంత్రిని చేస్తే.. ధృతరాష్ట్ర కౌగిలితో కేసీఆర్ ఆయన్ను ఖతం చేశారని మండిపడ్డారు. ఏ అవకాశం వచ్చినా పద్మశాలి సోదరులకు న్యాయం చేయడమే మా ప్రభుత్వ విధానం అని సీఎం పేర్కొన్నారు. కేంద్రంతో మాట్లాడి ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఏర్పాటు చేయడమే కాదు… దానికి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టుకున్నాం అని గుర్తు చేశారు. ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కూడా కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడతామని ఈ వేదికగా ప్రకటిస్తున్నట్లు రేవంత్ తెలిపారు. ఆ బాధ్యతను మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుకి అప్పగిస్తున్నట్లు చెప్పారు.
మీ కుటుంబ సభ్యుడిలా ఆదుకుంటా – Revanth Reddy
మహిళా స్వయం సహాయక సంఘాలకు ఇచ్చే 600 కోట్ల విలువైన 1కోటి 30 లక్షల చీరల ఆర్డర్ ను నేతన్నలకు ఇచ్చి చేనేతను ఆదుకుంటున్నాం అని సీఎం రేవంత్ వెల్లడించారు. “మీరు అడిగింది ఇవ్వడమే నా కర్తవ్యం. నన్ను ఆశీర్వదించిన ఈ సమాజానికి సేవ చేయడమే తప్ప నాకు మరో ఆలోచన లేదు. అభిమానంతో నన్ను గుండెల్లో పెట్టుకుంటే మీ కుటుంబ సభ్యుడిలా మిమ్మల్ని ఆదుకుంటా” అని సీఎం హామీ ఇచ్చారు.
రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో కులగణన నిర్వహించి బలహీనవర్గాల లెక్క తేల్చామని సీఎం తెలిపారు. ఇది ఇష్టం లేని వారు లెక్కలు తప్పని మాట్లాడుతున్నారన్నారు. కులగణనపై అసెంబ్లీలో తీర్మానం చేస్తే మోదీ మెడపై కత్తిలా వేలాడుతుందని బీఆర్ఎస్(BRS), బీజేపీ(BJP) లెక్కలు తప్పు అని మాట్లాడుతున్నాయని విమర్శించారు. బలహీన వర్గాల హక్కులను కాలరాసి వారి గొంతులను నులిమేసే కుట్ర జరుగుతోందని రేవంత్ అన్నారు.
“కేసీఆర్(KCR) లెక్కలో ఉన్నత కులాలు 21 శాతం అయితే… నేను చేసిన లెక్కలో ఉన్నతకులాలు 15.28 శాతం మాత్రమే. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా మొగ్గలోనే తుంచేయాలనే కుట్ర జరుగుతోంది. ఈ కుట్రలను బీసీ సమాజం తిప్పికొట్టాలి. ఇతర రాష్ట్రాల ఎన్నికలలోనూ ఇక్కడి పద్మశాలీల పాత్ర కీలకంగా వ్యవహరిస్తున్నారు. కోటి రూపాయలతో షోలాపూర్ లో పద్మశాలీ ఆత్మగౌరవాన్ని నిలిపేలా మార్కండేయ భవనం నిర్మించేందుకు సహకరిస్తాం. ఆర్ధిక, రాజకీయంగా, ఉపాధి, ఉద్యోగ పరంగా ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. మీ కోసం క్రియాశీలక నిర్ణయాలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీ ఆత్మగౌరవాన్ని నిలబెట్టి మీ సోదరుడిగా అండగా ఉంటానని ఈ వేదికగా హామీ ఇస్తున్నా అని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.