హైదరాబాద్ మహా నగరంలో మెట్రో రైలు(Hyderabad Metro) సౌకర్యం అన్ని ప్రాంతాలకు అందుబాటులోకి తేవడానికి ఉద్దేశించిన మెట్రో రైల్ ఫేజ్-IIకు అనుమతించాలని ముఖ్యమంత్రి రేవంత్(Revanth Reddy) ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. ఈరోజు ఉదయం ప్రధాని మోదీని ఆయన అధికారిక నివాసంలో తెలంగాణ సీఎం రేవంత్, సీఎస్ శాంతికుమారి(CS Santhi Kumari), మంత్రి శ్రీధర్ బాబు(Sridhar Babu) మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీతో పలు అంశాలపై చర్చించారు. అందులో ఆర్ఆర్ఆర్, విభజన హామీలు, రాష్ట్రానికి నిధులు వంటి కీలక అంశాలు ఉన్నాయి. గత ప్రభుత్వం పదేళ్లుగా హైదరాబాద్ నగరంలో మెట్రో విస్తరణపై దృష్టి సారించలేదని ప్రధానమంత్రి దృష్టికి సీఎం తీసుకెళ్లారు.
హైదరాబాద్ నగరంలో ఫేజ్-II(Hyderabad Metro Phase II) కింద రూ.24,269 కోట్ల అంచనా వ్యయంతో 76.4 కి.మీ పొడవైన 5 కారిడార్లను ప్రతిపాదించామని వివరించారు. రీజినల్ రింగు రోడ్డు(RRR) (ఆర్ఆర్ఆర్) ఉత్తర భాగంలో ఇప్పటికే 90 శాతం భూ సేకరణ పూర్తయినందున దక్షిణ భాగాన్ని వెంటనే మంజూరు చేయాలని ప్రధానమంత్రి(PM Modi) గారిని కోరారు. ఉత్తర భాగంతో పాటే దక్షిణ భాగం పూర్తయితే ఆర్ఆర్ఆర్ను పూర్తిగా సద్వినియోగం చేసుకోగలమన్నారు. దక్షిణ భాగం భూ సేకరణకు అయ్యే వ్యయంలో 50 శాతం భరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రధానమంత్రి గారికి తెలిపారు.
ఆర్ఆర్ఆర్కు సమాంతరంగా రీజినల్ రింగ్ రైలు ప్రాజెక్టు ప్రతిపాదన ఉందని వివరించారు. ఈ రీజినల్ రింగ్ రైలు పూర్తయితే తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లోని రైలు మార్గాలతో అనుసంధానత (కనెక్టవిటీ) సులభమవుతుందని, రీజినల్ రింగ్ రైలుకు అనుమతి ఇవ్వాలని కోరారు. తెలంగాణకు వస్తువుల ఎగుమతులు, దిగుమతులు సులువుగా చేసేందుకు రీజినల్ రింగు రోడ్డు సమీపంలో డ్రైపోర్ట్ అవసరమని, ఆ డ్రైపోర్ట్ నుంచి ఏపీలోని సముద్ర పోర్ట్ లను కలిపేందుకు గ్రీన్ ఫీల్డ్ రోడ్డు తో పాటు రోడ్డును ఆనుకొని సమాంతరంగా రైలు మార్గం మంజూరు కోరారు. తెలంగాణ సంస్కృతి, ఆధ్యాత్మికత మూసీ నదితో ముడిపడి ఉందని… రాజధాని హైదరాబాద్ నగరం మధ్యగా మూసీ(Musi) ప్రవహిస్తోందని.. అంత ప్రాధాన్యం ఉన్న మూసీ పునరుజ్జీవనానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఈసా, మూసా నదుల సంగమంలో ఉన్న బాపూ ఘాట్ అభివృద్ధి, మూసీ ప్రక్షాళనకు 27 ఎస్టీపీల నిర్మాణం, మూసీ రిటైనింగ్ వాల్స్, కరకట్టల నిర్మాణం, మూసీ గోదావరి నదుల అనసంధానంతో కలిపి మొత్తంగా ప్రాజెక్టుకు రూ.20 వేల కోట్లు ఆర్థిక సహాయం అందచాలని కోరారు. గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ కు 222.7 ఎకరాల రక్షణ భూముల బదిలీకి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు 61 ఐపీఎస్ కేడర్ పోస్టులు వచ్చాయని, 2015లో రివ్యూ తర్వాత మరో 15 పోస్టులు అదనంగా వచ్చాయని, సైబర్ నేరాలు, డ్రగ్స్ కేసులు పెరగడం, రాష్ట్రంలో పెరిగిన పట్టణాలు, ఇతర అవసరాల దృష్ట్యా తెలంగాణకు అదనంగా 29 ఐపీఎస్ పోస్టులు మంజూరు చేయాలని కోరారు. సెమీ కండక్టర్ల పరిశ్రమ ఏర్పాటుకు అనువైన పరిస్థితులు తెలంగాణలో ఉన్నందున ఇండియా సెమీ కండక్టర్ మిషన్ ప్రాజెక్టును రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు అనమతించాలని కోరారు.
Read Also: శివాలయంలోని శివలింగం చోరీ..
Follow Us : Google News, Twitter, Share Chat