తెలంగాణ రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలా ఇబ్బంది పెడుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఆరోపించారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పటి నుంచి ప్రజలకు కష్టాలు తీవ్రతరమయ్యాయన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీలు కోటలు దాటాయని, వాటి అమలు విషయానికి వచ్చేసరికి పథకాల్లో కోతలు పెరిగాయని విమర్శించారు. హామీల అమలుపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తోందని అన్నారు. రైతుల రుణమాఫీ(Crop Loan Waiver) వందశాతం పూర్తయిందని చెప్తున్న కాంగ్రెస్.. పలు ప్రాంతాల్లో లోన్ కట్టలేదని రైతుల ఇళ్ల గేట్లను, పంపు స్టార్టర్లను ఎత్తుకెళ్తుంటే ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన(KTR) ఎక్స్(ట్విట్టర్) వేదికగా కీలక పోస్ట్ పెట్టారు.
‘‘నిన్న గేటు ఎత్తుకెళ్లారు..!
నేడు స్టార్టర్లు పీక్కెళ్లారు..!!
ఇక రేపు పుస్తెలతాళ్లు లాక్కెళతారా ??
తెలంగాణ ఆడబిడ్డలారా…!
ఈ తెలివితక్కువ కాంగ్రెస్ సర్కారుతో జెర పైలం..!!
అప్పుల పాలైన అన్నదాతలపై ఇంత కక్షనా ?
కష్టాల్లో ఉన్న కర్షకులపై కాంగ్రెస్ కు ఇంత కోపమా ??
సాగు నీళ్లిచ్చే సోయి లేదు..
పంటలు ఎండుతున్నా పట్టింపు లేదు.. కానీ..
రైతులు అష్టకష్టాలు పడుతుంటే వేధింపులా ?
బీఆర్ఎస్ ప్రభుత్వం రద్దుచేసిన నీటితీరువాను..
ఐదేళ్ల తరువాత ఇప్పుడు వసూళ్లకు తెగబడతారా ??
తెలంగాణ రైతులంటే అంత అలుసైపోయారా ?
ఓట్లనాడు ప్రేమ ఒలకబోసి గద్దెనెక్కాక నరకం చూపిస్తారా ??
2 లక్షల రుణమాఫీ సక్కగ చేయని..
సన్నాసులు ఇంత దారుణానికి ఒడిగడతారా ??
రైతు భరోసాకు సవాలక్ష ఆంక్షలు పెట్టి..
రైతన్నను సంక్షోభంలోకి నెట్టింది మీరు కాదా ??
పెట్టుబడి సాయాన్ని ఎగ్గొట్టి..
మళ్లీ అప్పులపాలయ్యేలా చేసిన పాపం మీది కాదా కాదా !!
ఆత్మగౌరవంతో బతికే అన్నదాతలపై ఈ వరుస దాష్టీకాలేంటి ?
మీరు చేసిన పాపాలకు బక్కచిక్కిన రైతులపై ఈ దుర్మార్గాలేంటి ?
వ్యవసాయరంగంలో సంతోషం ఆనవాళ్లు చెరిపేసి..
సమైక్యరాష్ట్రంలో పీడించిన సంక్షోభం ఆనవాళ్లను..
తెలంగాణ నేలపై మళ్లీ తెస్తామంటే రైతాంగం సహించదు
సంఘటితంగా పోరాడుతది..! సీఎంకు బుద్ధి చెబుతది..!!’’ అని వ్యాఖ్యానించారు.