దక్షిణ భారతదేశంలో జరుగుతున్న డీలిమిటేషన్ ప్రక్రియ వల్ల కలిగే పరిణామాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం చెన్నైలో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల నాయకులు నిర్వహించిన డీలిమిటేషన్ వ్యతిరేక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వ ప్రస్తుత డీలిమిటేషన్(Delimitation) వల్ల అనేక నష్టాలు జరుగుతాయని హెచ్చరించారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ వివక్షపూరిత విధానాల వలన దక్షిణాదికి అనేక నష్టాలు జరుగుతున్నాయన్నారు.
దేశ అభివృద్ధి కోసం పని చేసినందువలన ఈరోజు దక్షిణాదికి నష్టం జరుగుతుందని కేటీఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. “మనమంతా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం. ప్రజాస్వామ్యం మందబలం ఆధారంగా నడవరాదు. మందబలం ఉన్నందువలన నియంతత్వం రావద్దు. దేశ అభివృద్ధిలో ముందు వరుసలో ఉన్న రాష్ట్రాలకు నష్టం కలిగిస్తూ… దేశాన్ని వెనక్కి నడిపిస్తున్న రాష్ట్రాలకి ఈ డిలిమిటేషన్ విధానం లాభం చేకూరుస్తుంది” అని కేటీఆర్(KTR) తెలిపారు.
పరిపాలన ఆర్థిక అభివృద్ధిలో దక్షిణాది రాష్ట్రాలు దేశానికి ఆదర్శంగా ఉన్నాయి కానీ, దానివల్లనే తీవ్రమైన నష్టాన్ని ఎదుర్కొంటున్నాయని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. దేశానికి 36% జీడీపీలో భాగస్వామ్యం ఉన్న దక్షిణాది రాష్ట్రాలు శిక్షింపబడుతున్నాయని చెప్పారు. డీలిమిటేషన్ అంశం కేవలం పార్లమెంట్ ప్రాతినిధ్యం తగ్గడానికి పరిమితం కాదన్న ఆయన… ఆర్థికపరమైన నిధుల కేటాయింపుల్లో కూడా తీవ్రమైన నష్టం జరగబోతుందని పేర్కొన్నారు. నిధుల కేటాయింపుల్లో అధికారం పూర్తిగా కేంద్రీకృతమై నియంతృత్వం వైపు దారితీసే అవకాశం ఉందన్నారు. ఆర్థిక వనరుల కేంద్రీకృతం జరగడం వలన భవిష్యత్తులోనూ ప్రస్తుతం ఉన్న దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న నిధుల కేటాయింపులు అన్యాయం మరింతగా పెరుగుతుంది అని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు.
దక్షిణాది రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ వివక్ష కొత్త కాదన్న కేటీఆర్.. ఈ మధ్యకాలంలో ఈ వివక్ష అన్యాయం మరింత పెరిగిందని అన్నారు. ప్రస్తుతం బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం దీన్ని మరింత పెంచేలా డీలిమిటేషన్ అంశాన్ని ముందుకు తీసుకువచ్చిందని చెప్పారు. కేవలం జనాభా ఆధారంగా సీట్ల పెరుగుదల గనుక జరిగితే దేశ సమాఖ్య స్ఫూర్తికి తీవ్ర విఘాతం కలిగే ప్రమాదం ఉందన్నారు. మనమందరం భారతీయులం… అయితే మనందరికీ ఆయా ప్రాంతాల అస్తిత్వం ఉందన్న విషయాన్ని మర్చిపోవద్దని సూచించారు. విభిన్న భాషలు సాంస్కృతిక అస్తిత్వాలతో కూడిన ఒక సమైక్య దేశం అన్న విషయాన్ని మర్చిపోకూడదన్నారు.
వెనుకబడిన రాష్ట్రాలకు నిధులు ఇచ్చే అంశాన్ని మేము ఏమి వ్యతిరేకించడం లేదు కానీ… నిధుల కేటాయింపుల వివక్షను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని కేటీఆర్ స్పష్టం చేశారు. 1971 తర్వాత ఉన్న పార్లమెంటు సీట్లు కేటాయింపు తర్వాత జరిగిన జనాభా నియంత్రణ వలన ఈరోజు దక్షిణాదికి నష్టం జరగడం అన్యాయమన్నారు. “జనాభా నియంత్రణను దేశ అభివృద్ధి కోసం దక్షిణాది రాష్ట్రాలు పాటించాయి. ఉత్తరాది రాష్ట్రాలు జనాభా నియంత్రణలో విఫలమైనందువలన వారికి ఈరోజు డీలిమిటేషన్లో లబ్ధి జరగడం ఏ విధంగా కూడా సరైంది కాదు. ఇది దేశాన్ని వెనుక వేసిన వాళ్లకి రివార్డు ఇవ్వడం లాంటిదని కేటీఆర్ అన్నారు.
డీలిమిటేషన్ అనేది ఆర్థిక అభివృద్ధి పరిపాలన అభివృద్ధి వంటి అంశాల పైన జరగాలి కానీ కేవలం పరిపాలన పైన కాదని స్పష్టం చేశారు. ఈ అంశంలో జరుగుతున్న నష్టం పైన మాట్లాడకుంటే చరిత్ర మనల్ని క్షమించదన్నారు. మౌనం పాటిస్తే భవిష్యత్తు తరాలు ఈరోజు మన మౌనాన్ని తప్పకుండా ప్రశ్నిస్తాయని కేటీఆర్ తెలిపారు.