తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మినీ యుద్ధాన్ని తలపిస్తున్నాయి. ప్రతి అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటలే ఆయుధాలవుతున్నాయి. ఒకరిపైఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం జరిగిన బడ్జెట్ చర్చల్లో భాగంగా బీఆర్ఎస్ పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) ప్రశ్నల వర్షం కురిపించారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రూ.16.70 లక్షల కోట్లు ఖర్చు చేశారని, కానీ దాంతో ఏం నిర్మించారో ఎవరికీ తెలియదంటూ చురకలంటించారు. కేసీఆర్(KCR) నాయకత్వంలో ఆర్థిక క్రమశిక్షణ జాడ కూడా లేదన్నారు. అడ్డగోలుగా అప్పులు తెచ్చారే తప్ప.. వాటిని ఎలా వాడారు అన్నది మాత్రం ఎన్నడూ చెప్పలేదని విమర్శించారు.
‘‘రూ.16.70 లక్షల కోట్లతో నాగార్జున సాగర్ నిర్మించారా? ఎస్ఆర్ఎస్పీ నిర్మించారా? ఓఆర్ఆర్ నిర్మించారా? ఎయిర్పోర్ట్ కట్టారా? ఒక్క కాళేశ్వరం కోసం లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అది కూడా కూలిపోయింది. సింగరేణికి రూ.77 వేల కోట్లు బకాయిలు పెట్టారు. తమ పదేళ్ల పాలనలో ఒక్క గ్రామంలోనైనా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించారా? అసెంబ్లీ ఆమోదం లేకుండా రూ.2.30 లక్షల కోట్లు ఖర్చు చేశారు. ఈ విషయాన్ని కాగ్ స్వయంగా వెల్లడించింది. వాటిని ఏం నిర్మించడానికి వాడారు?’’ అని ప్రశ్నించారు భట్టి విక్రమార్క(Bhatti Vikramarka).