తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు మాజీ సీఎం(KCR), బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కూడా హాజరుకానున్నారు. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న క్రమంలో బీఆర్ఎస్ పార్టీ నేతలతో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్.. తెలంగాణ భవన్లో సమావేశమయ్యారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో(Assembly Sessions) ఎలా నడుచుకోవాలి? ఏయే అంశాలపై చర్చించాలి? వంటి అంశాలపై చర్చించనున్నారు.
అంతేకాకుండా అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాలు, బీఆర్ఎస్ నడుచుకోవాల్సిన తీరుపై వ్యూహాలు రచిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపాలని కేసీఆర్ సూచించినట్లు సమాచారం. అదే విధంగా కొందరు నేతలకు వార్నింగ్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటూ కొందరు పార్టీ బలోపేతాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని, అలా చేస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారని సంబంధిత వర్గాల నుంచి అందిన సమాచారం. అదే విధంగా పార్టీకోసం పని చేసే వారికి పార్టీ ఎళ్లవేళలా అండగా ఉంటుందని భరోసా కల్పించినట్లు తెలుస్తోంది.
అదే విధంగా అతి త్వరలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా కేసీఆర్(KCR) చర్చించి, పలు కీలక సూచనలు చేశారు. ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయడంతో పాటు పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని సూచించారు.