కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తీవ్ర విమర్శలు గుప్పించారు. మహాశివరాత్రి రోజు.. ప్రభుత్వ వసతి గృహంలోని విద్యార్థులకు అన్నం పెట్టకుండా.. గుడిలో అన్నదానం చేస్తున్నారు.. అక్కడకు వెళ్లాలని హాస్టల్ సిబ్బంది చెప్పడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ ఘటన నాగర్కర్నూలు జిల్లా బల్మూర్ మండలం కొండనాగులలోని ఎస్టీ బాలుర వసతి గృహంలో చోటుచేసుకుంది. దీనిని ఉద్దేశించి కేటీఆర్ ఎక్స్(ట్విట్టర్) వేదికగా పోస్ట్ పెట్టారు.
‘‘పరాకాష్టకు చేరిన ప్రజాపాలన. విషాదంలో మంత్రుల వినోదం. హెలికాప్టర్ యాత్రలు .. చేపకూర విందులు. హాస్టల్ విద్యార్థులకు మాత్రం అన్నం పెట్టకుండా పస్తులు. విద్యార్థులకు కనీసం తిండి పెట్టలేని దుస్థితిలో రేవంత్(Revanth Reddy) ప్రజా ప్రభుత్వం. “అన్నం వండలేదు గుడిలో తినండి” అని విద్యార్థులకు ఆదేశాలు ఇచ్చిన నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం బల్మూరు మండలం కొండనాగుల ఎస్టీ బాలుర హాస్టల్ సిబ్బంది. కొండనాగులలోని ఎస్టీ బాలుర హాస్టల్లో(Kondanagula ST Boys Hostel) శివరాత్రి పండుగ రోజు 380 మందికి గాను 200 మంది విద్యార్థులు ఉన్నారు.
అయితే మధ్యాహ్న భోజనం గుదిబండ శివాలయంలో చేసే అన్నదానానికి వెళ్ళి తినాలని, రాత్రి భోజనం కోసం వీరం రామాజిపల్లిలోని గంగమ్మ దేవాలయంలో అన్నదానానికి వెళ్లి తినమని విద్యార్థులకు చెప్పి వంట చేయడం మానేశిన హాస్టల్ సిబ్బంది. భోజనం కోసం అంత దూరం నడిచి వెళ్ళే ఓపిక లేక పస్తులు ఉన్న విద్యార్థులు. పండగ పూట విద్యార్థులకు కనీసం భోజనం పెట్టకుండా, అన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి తినమని చెప్పడం ఏంటి అని ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు, విద్యార్థుల తల్లితండ్రులు. పండగపూట విద్యార్థులను పస్తులుంచడమే ప్రజాపాలనా?’’ అని KTR నిలదీశారు.