తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy), మంత్రి జూపల్లిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా నుంచి చెప్తున్నానని, పింక్ బుక్ను కచ్చితంగా మెయింటెన్ చేస్తామని వెల్లడించారు. అందులో ప్రతి ఒక్కరి చిట్టాలు రాస్తామని, టైమ్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికీ తగిన బదులు చెప్తామని హెచ్చరించారు. ఇందులో చిన్న నాయకుడు, పెద్ద నాయకుడు అన్న తేడా లేదని, ఏ ఒక్కరినీ వదిలిపెట్టకుండా అంతకంత రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని అన్నారు.
‘‘ముఖ్యమంత్రి సొంత జిల్లా నుంచి చెబుతున్నా… కచ్చితంగా పింక్ బుక్కు మైంటైన్ చేస్తాం. బీఆర్ఎస్(BRS) కార్యకర్తలను వేధించే ఎంత పెద్ద నాయకులైనా, అధికారులనైనా ఎవరిని వదిలిపెట్టం. పింక్ బుక్కులో అందరి చిట్టా రాసుకుంటాం. మాకు కూడా టైం వస్తుంది… అప్పుడు అందరి సంగతి చెప్తాం. మంత్రి జూపల్లి కృష్ణారావు(Jupally Krishna Rao) బీఆర్ఎస్ కార్యకర్తలను తీవ్రంగా వేధిస్తున్నారు. చిన్న విమర్శ చేసినా, ప్రశ్నించినా అక్రమ కేసులు పెట్టిస్తున్నారు. శ్రీధర్ రెడ్డి అనే కార్యకర్తను దారుణంగా చంపేసినప్పటికీ పోలీసులు కేసు దర్యాప్తును ముమ్మరం చేయడం లేదు. కాంగ్రెస్ నాయకులు హంతకులకు కొమ్ముకాస్తున్నారు.
తమ మీటింగు కోసం ఫ్లెక్సీలు కడితే పరమేశ్వర్ అనే కార్యకర్తపై జూపల్లి దాడి చేయించారు. ఇదేమి రాజ్యం? కాంగ్రెస్ నాయకులు ఎందుకు భయపడుతున్నారు? కొల్లాపూర్(Kollapur) నియోజకవర్గానికి జూపల్లి కృష్ణారావు టూరిస్ట్ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఎప్పుడో ఒకసారి మాత్రమే ఆయన నియోజకవర్గానికి వస్తున్నారు. సన్న వడ్లకు బోనస్ అని చెప్పి భోగస్ చేసిన ప్రభుత్వం. రైతు భరోసా, రుణమాఫీ గ్రామాల్లో సగం మందికి కూడా రాలేదు’’ అని ఆమె(MLC Kavitha) విమర్శించారు.