Mother kills her five months son at narayanapet district: అమ్మతనం చనిపోయిందో.. తొమ్మిది నెలలు కడుపులో మోసి కన్న మమకారం మరిచిపోయిందో.. ఐదు నెలల పసికందును తన చేతులతోనే గొంతుపిసికి చంపేసి, బావిలో పడేసింది. ఈ దారుణ ఘటన నారాయణపేట జిల్లా కోస్గి పట్టణంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే, కోస్గి పట్టణంలో హరిజనవాడలో నివాసం ఉంటున్న గోవిందుకు ఇద్దరు భార్యలు. మెుదటి భార్యకు కొడుకు, కూతురు ఉండగా, పుట్టుకతోనే మూగ అయిన రెండో భార్య కాశమ్మకు ఐదు నెలల కుమారుడు ఉన్నాడు.
Mother kills her son: ఆనందంగా ఉండే కుటుంబంలో ఏం జరిగిందో, కాశమ్మకు ఏం బుద్ధి పుట్టిందో, ఐదు నెలల బాలుడిని రాత్రి మూడు గంటల సమయంలో గొంతు పిసికి హత్య చేసింది. అనంతరం బావిలో పడేసి.. ఏమీ తెలియనట్లు ఇంటికి వచ్చేసింది. ఉదయం లేచిన కుటుంబ సభ్యులు బాబు గురించి ఆరా తీయగా.. ఎవరో ఎత్తుకెళ్లిపోయారని సైగలతో చెప్పింది. ఎంత వెతికినా ఆచూకీ లభ్యం కాకపోవటంతో, పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కాశమ్మను గట్టిగానే నిలదీయటంతో, తానే చంపేసి, బావిలో పడేసినట్లు సైగలతో చెప్పింది.
కాశమ్మ చెప్పిన వివరాల మేరకు బావి వద్దకు వెళ్లి చూడగా, పసికందు మృతదేహం నీటి పైన తేలుతూ ఉంది. వెంటనే బాలుడి మృతదేహాన్ని వెలికి తీసి, నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేశామనీ, అసలు బాలుడిని తానే చంపిందా.. లేదా, ఎవరన్నా చెప్తే ఇలా చేసిందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.