Group1 Results | తెలంగాణ రాష్ట్రంలో 563 గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన మెయిన్స్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్షలో అభ్యర్థులు పొందిన ప్రాథమిక మార్కుల వివరాలను టీజీపీఎస్సీ సోమవారం మధ్యాహ్నం వెల్లడించింది. గతేడాదిలో జరిగిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు 21,093 మంది హాజరైన విషయం తెలిసిందే. టీజీపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో అభ్యర్థులు తమ టీజీపీఎస్సీ ఐడీ, మెయిన్స్ హాల్టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేసి పేపర్ల వారీగా మార్కులను పొందొచ్చు. గతేడాది అక్టోబర్ 21 నుంచి 27 వరకు గ్రూప్ -1 సర్వీసెస్ మెయిన్స్ పరీక్షలు నిర్వహించారు.
మొత్తం ఏడు పేపర్లుగా నిర్వహంచిన ఈ పరీక్ష వాల్యుయేషన్ ప్రక్రియను పూర్తి చేసిన అధికారులు.. మార్కుల వివరాలను తాజాగా అభ్యర్థుల లాగిన్లలో అందుబాటులో ఉంచారు. ఈ మార్కులను మార్చి 16 సాయంత్రం 5గంటల వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు మెయిన్స్లో సాధించిన మార్కుల షీట్లను డౌన్లోడ్ చేసుకొని రిక్రూట్మెంట్ ప్రక్రియ పూర్తయ్యే వరకు దాచి ఉంచాలని టీజీపీఎస్సీ సూచించింది. మరోవైపు, అభ్యర్థులకు తమ మార్కుల రీకౌంటింగ్కు దరఖాస్తు చేసుకొనే అవకాశం కల్పించింది.
Group1 Results | అభ్యర్థులు టీజీపీఎస్సీ వెబ్సైట్లో మార్చి 10 నుంచి 24వ తేదీ సాయంత్రం 5గంటల వరకు ఒక్కో పేపర్కు రూ.1000 చొప్పున చెల్లించి మార్కుల రీకౌంటింగ్కు దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికోసం కేవలం ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రీకౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత అభ్యర్థులందరి మొత్తం మార్కులను కమిషన్ వెబ్సైట్లో ఉంచుతారు. తుది జనరల్ ర్యాంకింగ్స్ జాబితాను విడుదల చేసి.. దాని ఆధారంగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు పిలవనున్నారు. నోటిఫికేషన్లో సూచించినట్లుగా అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఇతర డాక్యుమెంట్లు సిద్ధంగా ఉంచుకోవాలని టీజీపీఎస్సీ సూచించింది.