ప్రజాభవన్లో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించనున్న అఖిలపక్ష సమావేశానికి తాము హాజరుకాలేమని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) స్పష్టం చేశారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కకు లేఖ రాశారు. ముందుగా సమావేశానికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఏంపీలకు వారి నియోజకవర్గంలో ముందస్తు కార్యక్రమాలతో ఈరోజు షెడ్యూల్ బిజీగా ఉందని, వాటి వల్ల భేటీకి రాలేకపోతున్నారని ఆయన వివరించారు.
‘‘ఈ సమావేశానికి సంబంధించిన ఆహ్వానం నాకు శుక్రవారం అందింది. దీంతో పార్టీలో అంతర్గతంగా, జాతీయ నాయకత్వంతో మాట్లాడే అవకాశం లేకుండా పోయింది. భవిష్యత్ లో సమావేశాలకు ముందుగా సమాచారం ఇవ్వండి. పార్టీలో చర్చించి హాజరవుతాం. ఈరోజు అధికారికంగా షెడ్యూల్ ఫిక్స్ అయింది. మోడీ నేతృత్వంలో తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది’’ అని కిషన్ రెడ్డి(Kishan Reddy) తెలిపారు. అయితే ఈ సమావేశంలో తెలంగాణకు సంబంధించి కేంద్రం ప్రభుత్వం దగ్గర పెండింగ్లో ఉన్న అంశాలపై చర్చించాలని నిర్ణయించారు. ఇప్పటికే ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రజాభవన్కు(Praja Bhavan) చేరుకున్నారు.
బీఆర్ఎస్(BRS) ఎంపీలు కూడా ఈ సమావేశానికి హాజరుకావడం లేదని సమాచారం. శుక్రవారం ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఈ ఆల్ పార్టీ ఎంపీలతో భేటీపై కేసీఆర్తో చర్చించారు బీఆర్ఎస్ ఎంపీలు. బీఆర్ఎస్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్య వహిస్తున్న నలుగురు ఎంపీలు ఈ చర్చలో పాల్గొన్నారు. కాగా, కేసీఆర్(KCR) సూచనల మేరకే వారు ఈ సమావేశానికి హాజరుకావడం లేదని తెలుస్తోంది.