నారాయణపేట జిల్లా పర్యటనలో భాగంగా అప్పకల్లో మహిళా సమాఖ్య పెట్రోల్ బంక్(Women Petrol Bunk)ను సీఎం రేవంత్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి జిల్లాలో మహిళా సమాఖ్య పెట్రోల్ బంక్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. మహిళా సమాఖ్య సభ్యులకు ఏడాదికి రెండు చీరలు ఇస్తామన్నారు. ‘‘రాష్ట్రవ్యాప్తంగా మహిళా సమాఖ్యలో మొత్తం 67 లక్షల మంది ఉన్నారు. ఈ సభ్యులకు ఇకపై రూ.1000 కోట్ల ఖర్చుతో ఏడాదికి రెండు మంచి చీరలు అందిస్తాం. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం.
శిల్పారామం(Shilparamam) దగ్గర మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను విక్రయించడానికి ఏర్పాట్లు చేశాం. వెయ్యి మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ను మహిళలు నిర్వహించబోతున్నారు. తొలుత ప్రతి జిల్లాలో ఒకచోట ప్రభుత్వ భూముల్లో మహిళా సమాఖ్యలకు పెట్రోల్ బంక్(Women Petrol Bunk)లు ఏర్పాటు చేస్తాం. ఆ తర్వాత అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక్కటైనా ఉండేలా చర్చలు చేపడతాం. గ్రామాల్లో స్కూళ్ల నిర్వహణ బాగుండేలా మహిళలు చర్యలు తీసుకోవాలి. ఉపాధ్యాయులు లేకపోయినా, వసతులు సరిగా లేకపోయినా జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లింది. నిధులు నేనిస్తా.. నిర్వహణ మీ చేతుల్లో ఉంటుంది. నిధులు ఇచ్చినా నిర్వహణ సరిగా లేకుంటే ప్రయోజనం శూన్యం’’ అని అన్నారు.