YS Sharmila |గవర్నర్ తమిళిసై కి షర్మిల బహిరంగ లేఖ

-

గవర్నర్ తమిళిసైకి వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) బహిరంగ లేఖ రాశారు. ఆర్టికల్ 317 ప్రకారం TSPSC బోర్డ్ రద్దుకు రాష్ట్రపతికి సిఫార్సు చేయాలని, కొత్త బోర్డ్ వెంటనే ఏర్పాటు చేసేలా చూడాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

YS Sharmila లేఖలో ఏం రాశారంటే…

దేశంలోనే ఒక కమిషన్ లో జరిగిన అతిపెద్ద స్కాం. సంతలో సరుకులు అమ్మినట్లుగా కీలకమైన పరీక్షా పేపర్లు అమ్మి 30లక్షల మంది జీవితాలతో చెలగాటం ఆడారు. ఈ పేపర్ లీకుల వెనుక బోర్డ్ చైర్మన్, మెంబర్లు, ఉద్యోగుల నుంచి రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రుల వరకు హస్తం ఉంది. ప్రభుత్వ పెద్దల ప్రోద్బలం లేకుండా ఇలా జరగడం అసాధ్యం. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన TSPSC పూర్తి విశ్వసనీయతను కోల్పోయింది. TSPSC పేపర్ లీకేజీపై రాష్ట్ర ప్రభుత్వ హయాంలో నియమించిన సిట్ పనితీరు నమ్మశక్యంగా లేదు. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఈ కేసులో కిందిస్థాయి ఉద్యోగులను బలి చేస్తున్నారు. పాత్రధారులను మాత్రమే దోషులుగా తేలుస్తూ సూత్రధారులను తప్పించే విధంగా దర్యాప్తు సాగుతోంది.

ఈ కేసును నీరు గార్చే ప్రయత్నాలు సాగుతున్నాయి. కేవలం ఇద్దరు వ్యక్తులు మాత్రమే పేపర్లు లీక్ చేశారని, మరెవరి ప్రమేయం లేదని కేసును మూసివేసే కుట్ర జరుగుతోంది. స్వయంగా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్(KTR) ఆ ఇద్దరు వ్యక్తులే పేపర్ లీక్ చేశారని జడ్జిమెంట్ కూడా ఇచ్చేశారు. దర్యాప్తుకు ముందే దోషులు ఎవరనేది తేల్చేశారు. తనకేం సంబంధం లేదని చెప్పుకొస్తున్న మంత్రి గారు దోషులను ఎలా నిర్ణయిస్తారు? దొంగెవరు అంటే భుజాలు తడుముకున్నట్లు కేటీఆర్ గారి తీరుంది. అంతేకాక కీలకమైన డాటా మంత్రి చేతుల్లోకి వెళ్లింది. పలు వేదికల్లోనూ పరీక్షలు ఎవరెవరు రాశారో చెప్పేస్తున్నారు. ఇతరులకు దొరకని డాటా కేవలం మంత్రికి మాత్రమే ఎలా అందింది?

పేపర్ లీకుల వెనుక బోర్డు చైర్మన్ జనార్ధన్ రెడ్డి, సెక్రెటరీ, బోర్డు సభ్యుల దగ్గర నుంచి ప్రగతి భవన్ మంత్రుల వరకు లింకులు ఉన్నాయి. పెద్దల హస్తం ఉంది కాబట్టే ఈ ప్రభుత్వానికి సీబీఐతోనో లేక సిట్టింగ్ జడ్జితోనో విచారణ జరిపిస్తే అసలు నిజాలు బయటపడతాయని భయం పట్టుకుంది. తీగ లాగితే ఈ కేసు.. ప్రగతి భవన్ డొంక కదులుతుందని ముఖ్యమంత్రి గారు భయపడుతున్నారు. అందుకే ఇప్పటివరకు పేపర్ లీకులపై సీఎం కనీసం రివ్యూ చేయలేదు. లక్షల మంది నిరుద్యోగుల జీవితాలకు సంబంధించిన అంశంలో కేసీఆర్ గారు బయటకు వచ్చి భరోసా ఇచ్చింది లేదు. TSPSCలో పేపర్ లీక్ స్కాం జరిగి నెలన్నర దాటింది. స్వయంగా చైర్మన్ జనార్ధన్ రెడ్డి విచారణను ఎదుర్కొన్నారు. పేపర్ లీకుల వెనుక ఆయన హస్తం లేదని సిట్ ఇంకా క్లీన్ చీట్ కూడా ఇవ్వలేదు.

ఇంత పెద్ద తప్పిదం కమిషన్ లో జరిగితే ఒక్క చిన్న చర్య కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోలేదు. తక్షణ చర్యలుగా బోర్డు రద్దు చేయలేదు. కనీసం చైర్మన్ ను బర్తరఫ్ చేయలేదు. జనార్ధన్ రెడ్డి సైతం నైతిక బాధ్యత వహించి రాజీనామా కూడా చేయలేదు. పైగా చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టి నమ్మకాలు, అమ్మకాలు, మోసపోయాం అంటూ అర్థ పర్థం లేని మాటలు చెప్తున్నారు. కేసు విచారణ జరుగుతుండగానే దోషులు ఎవరో ఇంకా నిర్దారణ కాకముందే, రాష్ట్ర ప్రభుత్వం హుటాహుటిన మళ్లీ రద్దయిన పరీక్షలను నిర్వహిస్తోంది. దొంగలకే తాళాలు అప్పజెప్పినట్లు పేపర్ లీకుల వెనుక ఉన్న సూత్రధారులతోనే పరీక్షల నిర్వహణ జరుగుతోంది.

దేశంలో మిగతా రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లలో అదే విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పేపర్ లీకులు జరిగినా తప్పులు దొర్లినా, చైర్మన్లు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేసిన సంఘటనలున్నాయి. ఒక్క పేపర్ లీక్ అయితేనే చైర్మన్ ని అరెస్ట్ చేసిన సంఘటనలు ఉన్నాయి. స్వయంగా మంత్రులను సైతం బర్తరఫ్ చేశారు. కానీ ఇక్కడ ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 15పేపర్ల వరకు పరీక్షాపత్రాలు లీక్ అయినా ఎటువంటి చర్యలు లేవు. నిరుద్యోగుల నుంచి ఆందోళనలు రోజురోజుకు ఉధృతం అవుతుండడంతో విషయం పక్కదారి పట్టించేందుకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అనుమానాలు కలుగుతున్నాయి.

ఎన్నికలు దగ్గర పడడంతో ఉద్యోగాలు ఇవ్వలేదనే మచ్చను తుడిపేసుకునేందుకు నిరుద్యోగుల జీవితాలతో ఈ ప్రభుత్వం ఆటలు ఆడుకుంటుంది. ఇప్పటికే అన్ని పేపర్లు లీక్ అయినా.. అదే పాత కమిషన్ నుంచే పరీక్షలు పెడితే పేపర్లు లీక్ కావన్న గ్యారెంటీ లేదు. కనీసం ఒక విజిలెన్స్ సైతం ఏర్పాటు చేయలేదు. పేపర్ లీకుల విషయంలో ఇంటి దొంగలను పట్టుకోకుండా వారితోనే పరీక్షలు నిర్వహించడం ఆమోదకరమైన నిర్ణయం కాదు. రాష్ట్ర గవర్నర్ గా మీ విచక్షణాధికారాలు ఉపయోగించి బోర్డు రద్దు చేసేలా చూడాలని వినతి.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 317 ప్రకారం రద్దు విషయమై రాష్ట్రపతికి సిఫారసు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. రాజ్యాంగం ప్రకారం ఈ నిర్ణయం తీసుకొనే బాధ్యత మీపై ఉందని సవినయంగా గుర్తు చేస్తున్నాం. 30 లక్షల మంది జీవితాలు.. మీ నిర్ణయం మీద ఆధారపడి ఉన్నాయి. తక్షణం మీరు బోర్డు రద్దు కోసం సిఫారసు చేసి, కొత్త బోర్డు ఏర్పాటు చేసే దిశగా తోడ్పాటు అందించి, నిరుద్యోగులకు న్యాయం చేస్తారని భావిస్తున్నాం అంటూ షర్మిల(YS Sharmila) తన లేఖ ద్వారా గవర్నర్ తమిళిసైకి విజ్ఞప్తి చేశారు.

Read Also: తెలంగాణలో బీజేపీ భారీ కార్యాచరణ.. రంగంలోకి షా, జేపీ

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Election Campaign: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ప్రచారం

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడింది. నెల రోజులకు పైగా...

YS Vijayamma: షర్మిలకు మద్దతు ప్రకటించిన తల్లి విజయమ్మ 

ఏపీ ఎన్నికల ప్రచారం ముగుస్తున్న సమయంలో సంచలన పరిణామం చోటుచేసుకుంది. సీఎం...