భారత్​లో ఫోర్త్ వేవ్ ఎంట్రీ..శాస్త్రవేత్తల కీలక ప్రకటన!

Fourth wave entry in India..Scientific announcement by scientists!

0
90

గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. మొదటి వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ లో కరోనా మహమ్మారి సృష్టించిన కల్లోలం అంతా ఇంతా కాదు. ఇక ఇది సరిపోదంటూ కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చాయి. ప్రస్తుతం భారత్‌లో కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఇక దేశంలో థర్డ్‌వేవ్‌ దాదాపు ముగిసినట్లే. అయితే ఇంతలోనే మహమ్మారి ఫోర్త్ వేవ్ గా ఎంట్రీ ఇవ్వబోతుందా? ఈ వేవ్‌లో కరోనా ఎలా ఉండబోతుంది? దీనిపై శాస్త్రవేత్తలు ఏమంటున్నారో తెలుసుకుందాం..

సెకండ్‌వేవ్‌ నుంచి థర్డ్‌వేవ్‌ వరకు దాదాపు 6 నెలల గ్యాస్‌ తీసుకున్న కోవిడ్‌.. ఈ సారి నాలుగు నెలలకే రీ-ఎంట్రీ ఇవ్వనుంది. ఈ థర్డ్‌వేవ్‌తో కరోనా పీడ వదిలిపోతుందని అనుకునే లోపే శాస్త్రవేత్తలు మరో బాంబు పేల్చారు. నాలుగోవేవ్‌కు నాలుగు నెలలే సమయం ఉందని, వచ్చే జూన్‌లో ఫోర్త్‌వేవ్‌ ఎంట్రీ ఇచ్చి అక్టోబర్‌ వరకు కొనసాగుతుందని అంచనా వేశారు. ‘భారత్‌లో నాలుగో దశ జూన్‌ 22న మొదలై, ఆగస్టు 23 పీక్‌ స్టేజ్‌కి చేరుకొని, అక్టోబర్‌ 24న ముగియనుందని అంచనా’ అని శాస్త్రవేత్తల బృందం వెల్లడించింది. ఈ అంశాలను పరిశోధించేందుకు వారు ‘బూస్ట్‌స్ట్రాప్’ అనే పద్ధతిని ఉపయోగించారు. దీని ద్వారా ఇతర దేశాల్లో రాబోయే వేవ్‌లను కూడా అంచనా వేయొచ్చని తెలిపారు.

అయితే నాలుగో వేవ్ తీవ్రత అనేది.. వైరస్ వ్యాప్తి, కొత్త వేరియంట్‌ల బట్టి ఉంటుందని స్పష్టం చేశారు. బూస్టర్ డోస్ పంపిణీ, వ్యాక్సినేషన్ లాంటి అంశాలపై కూడా ఫోర్త్‌వేవ్‌ తీవ్రత ఆధారపడి ఉంటుందని తెలిపారు. గత మూడు వేవ్‌ల సమయంలో కొవిడ్‌ కేసులు, పీక్‌ టైమ్‌, మరణాల సంఖ్యలో ఐఐటీ కాన్పుర్‌ పరిశోధకుల బృందం వేసిన అంచనాలు దాదాపు నిజమయ్యాయి. ఈ నేపథ్యంలోనే తాజా అధ్యయనం కూడా నిజమయ్యే అవకాశాలున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. అందుకే అలసత్వం వహించొద్దని, ప్రజలంతా కరోనా నిబంధనలు పాటించాలని సూచిస్తున్నారు.

ఇక మరో వైపు దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుతూ వస్తోంది. భారత్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,273 కోవిడ్ కేసులు నమోదైనట్లు ఆదివారం ఉదయం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో త ఎలిపింది. ఈ సంఖ్య మొన్నటి కంటే 10 శాతం తక్కువ. దీంతో దేశంలో నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 4,29,16,117కి చేరింది. ప్రస్తుతం దేశంలో 1,11,472 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కోవిడ్ తదితర కారణాలతో 243 మంది మరణించారు. దీంతో కోవిడ్ వల్ల మరణించినవారి సంఖ్య 5,13,724కి చేరింది. కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు.