నోట్ల రద్దుకు ఐదేళ్లు..డిజిటల్ చెల్లింపుల జోరు

Five years for cancellation of notes..Digital payments in full swing

0
31

కేంద్ర ప్రభుత్వం పాత నోట్ల రద్దు నేటికి ఐదేళ్లు పూర్తయింది. దేశంలో నల్లధనాన్ని వెలికితీయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2016, నవంబర్‌ 8న రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసింది. అయితే పెద్దనోట్లు రద్దు చేసిన తర్వాత డిజిటల్‌ చెల్లింపులు భారీగా పెరిగాయి. దేశంలోని గత ఐదేళ్ల కాలంలో డిజిటల్‌ చెల్లింపులు జోరందుకున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. డీమానిటైజేషన్​ తర్వాత డిజిటల్​ చెల్లింపులు పెరిగినప్పటికీ.. కరెన్సీ నోట్ల చలామణి కూడా పెరిగిందని ఆర్​బీఐ తాజాగా నివేదికలో వెల్లడించింది. కరోనా నేపథ్యంలో ప్రజలు నగదు నిల్వలకు ప్రాధాన్యం ఇవ్వడమే ఇందుకు కారణమని పేర్కొంది.

ఆర్బీఐ గణాంకాల ప్రకారం.. 2016 నవంబర్‌ 4 నాటికి దేశంలో చలామణిలో ఉన్న నోట్ల విలువ రూ.17.74 లక్షల కోట్లు. అయితే గత నెల 29 నాటికి అది రూ.29.17 లక్షల కోట్లకు చేరుకుంది. చలామణిలో ఉన్న నోట్ల విలువ 64 శాతం పెరిగింది. ఇక ఇదే సమయంలో చలామనిలో ఉన్న కరెన్సీ నోట్ల సంఖ్య 26.88 లక్షల నుంచి రూ.228.96 లక్షలకు చేరిందని గణాంకాలు చెబుతున్నాయి.

అయితే యూపీఐ సేవలను 2016లో ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ప్రతినెల సేవల ద్వారా చెల్లింపులు కూడా భారీగా పెరిగాయి. అక్టోబరులో 421 కోట్ల లావాదేవీలు జరిగాయి. వీటి విలువ రూ.7.71 లక్షల కోట్లుగా నమోదైనట్లు ఆర్బీఐ గణాంకాలు పేర్కొంటున్నాయి.

కరోనా మహమ్మారి కారణంగా తలెత్తిన పరిస్థితుల వల్ల ప్రజలు ముందు జాగ్రత్తగా నగదును దగ్గర ఉంచుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో గత ఆర్థిక సంవత్సరంలో నోట్ల చలామణి పెరిగింది. అలాగే డిజిటల్‌ చెల్లింపులు, డెబిట్‌, క్రెడిట్‌ కార్డులు, నెట్‌ బ్యాంకింగ్‌, యూపీఐ, ఇతర యాప్‌ల ద్వారా చెల్లింపులు భారీగా పెరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.