యూజర్‌ ఫ్రెండ్లీ యాప్‌గా వాట్సాప్‌..మరో రెండు కొత్త ఫీచర్లు..ఈసారి ఐఓఎస్‌ యూజర్ల కోసం!

WhatsApp as a user friendly app..two more new features ..

0
36

మొబైల్‌ యూజర్లకు వాట్సాప్‌ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తుంది. తాజాగా వాట్సప్ మరో రేండు ఫీచర్లను పరిచయం చేయనుంది. ఐఓఎస్‌ వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని వీటిని తీసుకురానుంది. ప్రస్తుతం ఎంపిక చేసిన వినియోగదారులకు (బీటా యూజర్లు) మాత్రమే ఈ ఫీచర్లు అందుబాటులో ఉండగా, త్వరలో అందరికీ వాట్సాప్‌ పరిచయం చేయనుంది. కొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ వాట్సాప్ వినియోగాన్ని మరింత యూజర్‌ ఫ్రెండ్లీ యాప్‌గా మార్చే ప్రయత్నం చేస్తోంది.

ఇందులో మొదటిది వాయిస్‌ మెసేజ్‌ పాజ్‌-అండ్-రెస్యూమ్‌/ప్లే ఫీచర్‌. ఈ ఫీచర్‌ను ఇప్పటికే డెస్క్‌టాప్‌, ఆండ్రాయిడ్‌ యూజర్లకు వాట్సాప్‌ పరిచయం చేసింది. తాజాగా పాజ్‌, రెజ్యూమ్‌ బటన్‌లతో మరింత డైనమిక్‌గా అప్‌డేట్‌ ఫీచర్‌ను ఐఓఎస్‌ వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త ఫీచర్ ద్వారా వాయిస్ మెసేజ్‌లను రికార్డ్‌ చేస్తున్నప్పుడు పాజ్, రెజ్యూమ్‌ చేసుకునే అవకాశం కల్పించింది. ఈ మేరకు వాయిస్‌ రికార్డింగ్‌ బటన్‌ను పైకి స్వైప్‌ చేయాల్సి ఉంటుంది.

ఇక రెండో ఫీచర్‌ న్యూ ఫోకస్‌ మోడ్‌. పనిలో ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో వాట్సాప్‌ మెసేజ్‌ నోటిఫికేషన్లు చిరాకు తెప్పిస్తుంటాయి. వాటిలో ఏది ముఖ్యమైనదో గమనించకుండానే అన్నింటినీ అలాగే వదిలేస్తాం. దీనికి చెక్‌ పెట్టేందుకు వాట్సాప్‌ ఫోకస్‌ మోడ్‌ ఫీచర్‌ను తీసుకొచ్చింది. ముఖ్యమైన వ్యక్తులు, గ్రూప్‌ల నుంచి మాత్రమే మెసేజ్‌ నోటిఫికేషన్‌ వచ్చేలా ఈ కొత్త ఫీచర్‌ అనుమతి ఇవ్వనుంది. మరోవైపు ఐఓఎస్‌ వినియోగదారుల కోసం మెసేజ్‌తో పాటు యూజర్‌ ప్రొఫైల్‌ ఫొటోను (డీపీ) నోటిఫికేషన్‌పై ప్రదర్శించేలా వాట్సాప్‌ కొత్త అప్‌డేట్‌ను ప్రారంభించింది.