కదిలే రైలును ఎక్కేందుకు యత్నించిన మ‌హిళ – కాపాడిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్

0
47

రైల్వే స్టేషన్ లో రైలు వ‌చ్చే స‌మ‌యంలో, క‌దిలే సమ‌యంలో ప్ర‌యాణికులు చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. కొంద‌రు ప్ర‌యాణికులు రైలు క‌దిలే స‌మ‌యంలో ఎక్కుతూ ఉంటారు. ఈ స‌మ‌యంలో ప‌ట్టాల‌పై జారిప‌డిపోయిన ఘ‌ట‌న‌లు చూశాం. కొంద‌రు వారి కాళ్లు చేతులుకూడా పొగొట్టుకున్నారు. మ‌రికొంద‌రు ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి స‌మ‌యాల్లో చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి అని రైల్వే అధికారులు చెబుతున్నారు.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో కదిలే రైలు ఎక్కబోయే ప్రయత్నంలో ఓ మహిళ జారిపడింది. ఈ స‌మ‌యంలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కు చెందిన ఓ కానిస్టేబుల్ సకాలంలో ఆ మ‌హిళ‌ని బయటికి లాగడంతో ప్రాణాపాయం తప్పింది.

ఆమె ప్లాట్ ఫాంపైకి చేరుకునే సమయానికి రైలు కదిలింది. దాంతో కంగారుపడిన ఆమె కదిలే రైలును ఎక్కేందుకు ప్రయత్నించింది. పట్టు దొరక్క రైలుకు ప్లాట్ ఫాంకు మధ్య ఇరుక్కుపోయింది.
దినేశ్ సింగ్ అనే ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ వెంట‌నే ఆమెని ప‌క్క‌కు లాగాడు. ప్ర‌యాణికులు చైన్ లాగ‌డంతో రైలు కూడా ఆగింది. వీడియో సామాజిక మాధ్యమాల్లో వైర‌ల్ అవుతోంది. ఆ కానిస్టేబుల్ ని అంద‌రూ ప్ర‌శంసిస్తున్నారు.