పెళ్లింట పెను విషాదం..మిన్నంటిన కుటుంబీకుల రోదనలు

0
50

తెలంగాణ: పెళ్లంటే ఇళ్లంతా సందడి. బంధువులు, స్నేహితులు, ఊళ్ళో వాళ్ళతో ఇంటి ఆవరణం కోలాహలంగా మారింది. ఒకరికొకరు కబుర్లు, జోకులు చేసుకుంటూ అప్పటివరకు ఆ ఇంట నవ్వులు పూశాయి. కానీ వారి నవ్వును చూసి కాలం ఓర్వలేకపోయింది. పిడుగులాంటి వార్త వారి బంధువుల గుండెల్ని పిండేసింది. రిసెప్షన్ జరగాల్సిన ఇంట పెను విషాదాన్ని మిగిల్చింది.

వరంగల్​ జిల్లా ఇల్లందలోని వరుడి ఇంటి వద్ద  రిసెప్షన్ జరగాల్సి ఉండగా రంగురంగుల టెంట్లు, డెకరేషన్, వంటకు కావాల్సిన సామాన్లు అన్ని సిద్ధం చేసుకున్నారు. అయితే మాంసాహారం తినని వారి కోసం కూరగాయల భోజనం వడ్డించాలని వారు భావించారు. కానీ దాని వెనక ఉన్న ప్రమాదాన్ని ఊహించలేకపోయారు.

కూరగాయలు తీసుకురావడానికి వరుడి సోదరుడైన సుధాకర్​, సోదరుని వరుసైన మరో యువకుడు బైక్ పై వరంగల్​కు వెళ్లారు. అన్ని రకాల కూరగాయలను తీసుకుని ఇంటికి తిరుగు పయనమయ్యారు. ఎంతో ఉత్సాహంగా బయల్దేరిన ఆ యువకులను మృత్యువు వెంటాడింది. తిరుగు ప్రయాణంలో నాయుడు పెట్రోల్ పంపు వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొన్నారు. దీనితో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఆ కూరగాయలన్ని యువకుల రక్తంతో తడిసిపోయాయి. అప్పటి వరకు నవ్వులు పూసిన ఆ ఇంట.. రోధనలు ప్రతిధ్వనించాయి.