‘కొండా’ మూవీ అప్డేట్..నక్సలైట్​ గెటప్​లో రామ్​గోపాల్​వర్మ..ఎందుకంటే?

0
37

కొండా దంపతుల జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘కొండా’. వివాదాస్పద దర్శకుడు రామ్​గోపాల్ వర్మ ఈ చిత్రాన్ని తీశారు. ఈ సినిమాలో కొండా మురళి పాత్రలో అదిత్ అరుణ్, సురేఖ పాత్రలో ఇర్రా మోర్ నటించారు. ఆదివారంతో చిత్రీకరణ పూర్తయింది.

ఈ సందర్భంగా వ‌రంగ‌ల్‌లో షూటింగ్ ముగింపు వేడుక నిర్వహించారు. దీనికి కొండా మురళి, సురేఖ దంపతులు హాజరయ్యారు. ఈ వేడుకలో నక్సలైట్​ వేషధారణలో దర్శనమిచ్చారు డైరెక్టర్ ఆర్జీవీ. అంతే కాదు.. ‘కొండా’, ‘బలుపెక్కిన ధనికుడా… కాల్ మొక్కుడు లేదిక’ పాటలకు పెర్ఫార్మెన్స్ చేశారు.

ఈ కార్యక్రమంలో ఆర్జీవీ మాట్లాడుతూ..సినిమా స్టార్ట్ చేసేముందు నేను కొండా మురళి పేరు వినలేదు. ఓ ఎన్నికల సమయంలో కొండా సురేఖ పేరు విన్నాను. ఆమె ఇంటర్వ్యూలు చూశా. నేను రాజకీయాలు ఫాలో అవ్వను. నాకు ఏ పార్టీతోనూ సంబంధం లేదు. నేను ముంబైలో ‘సత్య’, ‘కంపెనీ’, ఇక్కడ ‘రక్త చరిత్ర’ తీసినప్పుడు గానీ తెలంగాణలో సాయుధ పోరాటం గురించి తెలియదు. ఒక వ్యక్తి చెప్పారు. అప్పుడు ఆయన గురించి రీసెర్చ్ చేశా. ప్రతి కథకు, సినిమాకు ఓ క్యారెక్టర్ ఉంటుంది. ఉదాహరణకు… హిట్లర్ లేకపోతే రెండో ప్రపంచ యుద్ధం, గాంధీజీ లేకపోతే భారత స్వాతంత్య్ర పోరాటానికి అర్థమే లేదు. గాంధీ ఒకవైపు, హిట్లర్ మరోవైపు ఉంటే కొండా మురళి మధ్యలో ఉన్నారు.

త‌నను జైలులో చంపేస్తారా? అనే దాన్ని ఎదుర్కొని, చావుతో ఆడుకుని, నేడు ఇక్క‌డ కూర్చున్నారు. కొండా ముర‌ళి ఎక్స్‌పీరియ‌న్స్‌లు విని నేను విప‌తీరంగా ప్ర‌భావితం అయ్యాను. నాకు హిట్లర్, ముస్సోలిని, ప్రభాకరన్ నేపథ్యాలు తెలుసు. వీళ్లందరూ నమ్మిన సిద్ధాంతాలు, విలువల కోసం పోరాడతారు. అటువంటి అంశం నాకు కొండా మురళి జీవితంలో దొరికింది. అది పట్టుకుని, ఆ తాడును పట్టుకుని తీశాను. ఈ రోజు నాకు సాయుధ పోరాటం, నక్సలైట్ల గురించి తెలుసు. కొండా మురళి, సురేఖ జీవితాలను ఎంపిక చేసుకోవడానికి కారణం.. వాళ్ల నేపథ్యంలో ఈ కథ చెప్పడానికి అద్భుత అవకాశం దొరికింది. అందుకని, సినిమాకు ‘కొండా’ పేరు పెట్టాను.

ప్రమాదాన్ని కొండా మురళి కోరి తెచ్చుకున్నారు. ప్రమాదం వస్తుందని భయపడలేదు. దాన్ని చూసి స్ఫూర్తి పొంది సినిమా తీశాను. కొండా మురళి జీవించిన జీవితమే నా సినిమా కథ. కొండా మురళి శత్రువులు, కొంత మంది పోలీసులను కలిసి వాళ్లు చెప్పినది విన్న తర్వాత నాకు ఓ క్లారిటీ వచ్చింది. నా కెరీర్‌లో కొండా మురళి కంటే బెటర్ సబ్జెక్ట్ 30 ఏళ్లలో దొరకలేదు. నేను అనుకున్నది 20 శాతం తీసినా నా కెరీర్‌లో బెస్ట్ ఫిల్మ్ అవుతుంది” అని డైరెక్టర్ రామ్​గోపాల్ వర్మ అన్నారు.