సండే బిగ్ డే..’మా’ అధ్యక్ష పీఠం ఎవరిది?

0
44

మరికొన్ని గంటల్లో ‘మా’ కొత్త అధ్యక్షుడు ఎవరో తేలిపోనుంది. ఆదివారం ఉదయం ఎన్నికలు జరగనుండగా, రాత్రికి విజేతను ప్రకటించనున్నారు. ప్రతి రెండేళ్లకోసారి జరిగే ఈ అసోసియేషన్ ఎన్నికల్లో ఈసారి అధ్యక్ష బరిలో ప్రకాశ్​రాజ్, మంచు విష్ణు పోటీపడుతున్నారు.

సభ్యుల సంక్షేమం, భవన నిర్మాణమే లక్ష్యంగా 6 నెలల ముందే ప్రకాశ్ రాజ్ పోటీలోకి దిగగా..సభ్యులకు అవకాశాలు కల్పించడం సహా తెలుగు నటీనటుల ఆత్మగౌరవాన్ని కాపాడుతానని మంచు విష్ణు ఎదురొచ్చారు. ఇద్దరు కూడా విమర్శలు, ఆరోపణలతో మా ఎన్నికల వాతావరణాన్ని వేడెక్కించారు. సాధారణ ఎన్నికలను తలపించేలా మాటల యుద్ధం సాగించారు. విష్ణు సీనియర్ నటీనటుల మద్దతు కూడగట్టుకోగా..ప్రకాశ్​రాజ్ మెగా కుటుంబంపై ఆశలు పెట్టుకున్నారు.

ఈ రెండు ప్యానల్స్ నుంచి మొత్తం 54 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మంచు విష్ణు, ప్రకాశ్​రాజ్ ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని నువ్వా నేనా అన్నట్లు బరిలోకి దిగారు. ప్రకాశ్ రాజ్..మెగా కుటుంబం మద్దతుతో అధ్యక్షుడిగా నిలబడ్డారు. జీవిత రాజశేఖర్, శ్రీకాంత్, బెనర్జీ లాంటి అనుభవం ఉన్న నటీనటులతో ప్యానెల్ సిద్ధం చేసుకున్నారు. అసోసియేషన్​కు నూతన భవనంతోపాటు సభ్యుల ఆరోగ్యం, విద్య, వైద్యంపై తనకున్న ఆలోచనలను పంచుకున్నారు. తెలుగువాళ్లే అధ్యక్షుడిగా ఉండాలన్న విమర్శలను ప్రకాశ్​రాజ్ తిప్పికొట్టారు. చిరంజీవి సోదరుడు నాగబాబు సహా మరికొంత మంది నటీనటులు ప్రకాశ్​రాజ్​కు మద్దతుగా నిలబడ్డారు.

మా అసోసియేషన్​కు తెలుగు నటీనటులే అధ్యక్షుడిగా ఉండాలన్న వాదనతో కృష్ణ, కృష్ణంరాజు, బాలకృష్ణ సహా పలువురు సీనియర్ల మద్దతును మంచు విష్ణు కూడకట్టుకున్నారు. తెలుగు నటీనటుల ఆత్మగౌరవ నినాదంతో చిత్రపురి కాలనీ, కృష్ణానగర్, మణికొండ సహా పలు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించి సభ్యులకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. విష్ణుకు తోడుగా సీనియర్ నటుడు నరేశ్ రంగంలోకి దిగి ప్రత్యర్థి ప్రకాశ్​రాజ్ పై విమర్శలు గుప్పిస్తూ విష్ణును గెలిపించాలని పిలుపునిచ్చారు. మోహన్​బాబు సైతం రంగంలోకి దిగి.. ‘మా’ కుటుంబంలో సభ్యుడైన తన కుమారుడ్ని గెలిపించాలని కోరారు. స్వయంగా సభ్యులకు ఫోన్ చేసి విష్ణును గెలిపించాలని అభ్యర్థించారు. మా అధ్యక్ష పీఠం ఎవరిని వరిస్తుందో చూడాలి అంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.