సత్తా చాటుతున్న ఇండియన్స్..న్యూజిలాండ్ ఎంపీగా 18 ఏళ్ల తెలుగమ్మాయి..

0
37

వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, రాజకీయ తదితర రంగాల్లో ఇండియన్స్ చరిత్ర సృష్టిస్తున్నారు. కేవలం మన దేశాల్లోనే కాదు ఇతర దేశాల్లో ఇండియన్స్ తమ సత్తా చాటుతున్నారు. తాజాగా తెలుగమ్మాయికి అరుదైన గౌరవం దక్కింది. ఏకంగా 18 ఏళ్ల యువతి న్యూజిలాండ్ ఎంపీగా ఎంపికయింది.

వివరాల్లోకి వెళితే..ఇటీవల న్యూజిలాండ్ లో నామినేటెడ్ ఎంపీ పదవులకు ఎంపిక జరిగింది. ఈ నేపథ్యంలో ‘సేవా కార్యక్రమాలు, యువత’ విభాగానికి ప్రాతినిధ్యం వహించే పార్లమెంటు సభ్యురాలిగా 18 ఏళ్ల మేఘనను ఎంపిక చేశారు. వాల్కటో ప్రాంతం నుంచి ఎంపీగా ఆమెను ఎంపిక చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన గడ్డం రవికుమార్ ఉద్యోగ రీత్యా 2001లో భార్య ఉషతో కలిసి న్యూజిలాండ్లో స్థిరపడ్డారు. న్యూజిలాండ్ లోనే మేఘన పుట్టి పెరిగింది. కేంబ్రిడ్జిలోని సెయింట్ పీటర్స్ ఉన్నత పాఠశాలలోనే తన విద్యాబ్యాసం పూర్తి చేశారు. తన చిన్న తనం నుంచే మేఘన సేవా కార్యక్రమాలు అలవర్చుకుంది.

దేశంలో యువత ఎదుర్కొంటున్న సమస్యలపై తన గళాన్ని పార్లమెంటులో వినిపిస్తానని మేఘన తెలిపారు. న్యూజిలాండ్ పార్ల‌మెంటుకు ఎంపీగా.. అందులోనూ చిన్న వ‌య‌సులోనే మేఘ‌న ఎంపిక కావ‌డం త‌మ గ్రామానికే కాదు.. రాష్ట్రానికే గ‌ర్వ‌కార‌ణ‌మంటున్నారు టంగుటూరు వాసులు.