సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ లేఖ..రాష్ట్రమే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్

0
34

వడ్లను రాష్ట్ర ప్రభుత్వమే కొనాలని లేని పక్షంలో ముఖ్యమంత్రి పదవి నుండి తప్పుకోవాలని కోరుతూ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు.

గౌరవనీయులైన శ్రీ కె.చంద్రశేఖరరావు గారికి,
ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రప్రభుత్వం.

నమస్కారం …

విషయం: వడ్లను రాష్ట్ర ప్రభుత్వమే కొనాలని లేనిపక్షంలో ముఖ్యమంత్రి పదవి నుండి తప్పుకోవాలని కోరుతూ ……

ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ గారికి మీరు నిన్న అనేక అవాస్తవాలు, అబద్దాలతో లేఖ రాశారు. తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించేలా ధాన్యం సేకరణపై పచ్చి అబద్దాలు ప్రచారం చేశారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న మీరు మీ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడం కోసం బాధ్యతారహితంగా ఇటువంటి లేఖలు రాసి, దుష్ప్రచారం చేసి తెలంగాణ ప్రజానీకాన్ని, ముఖ్యంగా రైతాంగానికి తప్పుదోవ పట్టించడం దారుణం. మీరు ప్రధానమంత్రి గారికి రాసిన లేఖలోని అంశాలతోపాటు ధాన్యం సేకరణపై మీరు చెబుతున్నవన్నీ అబద్దాలేనని కేంద్ర వాణిజ్య, ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారు ఈరోజు ఆధారాలతో సహా తేల్చేశారు. పంజాబ్ సహా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ కేంద్రం బియ్యం సేకరిస్తుందే తప్ప ధాన్యం సేకరించడం లేదని స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో మీకు ముఖ్యమంత్రిగా ఉండే అర్హత ఒక్క క్షణం కూడా లేదు. బాధ్యతగల ప్రతిపక్ష పార్టీగా రాష్ట్ర రైతాంగానికి, తెలంగాణ ప్రజానీకానికి వాస్తవాలు తెలియజేయాల్సిన బాధ్యత మా పైన ఉంది. అందుకే ఈ బహిరంగ లేఖను తెలంగాణ బిజెపి శాఖ తరపున మీకు రాస్తున్నాము.
ధాన్యం కొనుగోలుకై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పౌరసరఫరాల కార్పొరేషన్‌ ద్వారా కొనుగోలు చేయాల్సి ఉన్నా….చేతులెత్తి డ్రామాలాడుతున్నారు. మాయమాటలతో జనాన్ని మభ్య పెట్టాలని చూస్తున్న మీ బండారం బయటపెట్టి నిజాలు ప్రజల ముందుకు తెచ్చే ప్రయత్నమే ఈ బహిరంగలేఖ యొక్క ముఖ్య ఉద్ధేశ్యం.

వడ్ల విషయంలో మొదటి నుండి మీవి కుప్పిగంతలే. తొలుత మీరు ‘వరి వేస్తే ఉరే గతి’ అని అన్నారు. తరువాత ఇకపై యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండబోవని, ధాన్యం పండిస్తే కొనాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదన్నారు. ఇప్పుడు మాట మార్చి కేంద్రమే రాష్ట్రంలో పండించిన వడ్లన్నీ కొనుగోలు చేయాలని యాగీ చేస్తున్నారు. బిజెపి మీద విషం కక్కుతున్నారు. ఒక ప్రభుత్వాధినేతగా ఉంటూ కేంద్ర మంత్రులను ఇష్టమొచ్చినట్లుగా బూతులు తిట్టడం చూస్తే మీ వ్యక్తిత్వం ఎట్లాంటిదో అర్థమౌతోంది.

కేంద్ర ప్రభుత్వం యాసంగిలో వరి ధాన్యం కొనబోమని చెప్పిందనడం నూటికి నూరు శాతం పచ్చి అబద్దం. వానా కాలం మాదిరిగానే యాసంగిలోనూ రాష్ట్రం నుండి ధాన్యం సేకరిస్తుంది. ఈ విషయంలో మీరు రైతులను పూర్తిగా తప్పుదోవ పట్టిస్తున్నారు. ధాన్యం కొనుగోలు చేసి మర ఆడించి బియ్యంగా మార్చి వాటిని ఎఫ్‌ సీఐకి అప్పగించే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం గత కొన్ని దశాబ్దాలుగా కొనసాగిస్తోంది. అందుకయ్యే మొత్తం ఖర్చుతోపాటు ఈ బాధ్యత నెరవేర్చినందుకు రాష్ట్రానికి కమీషన్ల రూపంలోనూ కేంద్రమే డబ్బులు చెల్లిస్తోంది. ఈ విషయాలు తెలిసి కూడా మీరు రైతులను మభ్యపెట్టాలని చూడటం భావ్యం కాదు.

కేంద్రమే నేరుగా వడ్లు కొనాలంటూ… కొత్త ప్రతిపాదన మీరు తీసుకురావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. వాస్తవానికి వడ్లను కొనుగోలు చేయడంలో ఐకేపీ కేంద్రాలు కీలకం. మార్కెట్‌ యార్డులు అవసరం. పెద్ద ఎత్తున అధికార యంత్రాంగం కావాలి. ఇవన్నీ రాష్ట్రం పరిధిలోనే ఉన్నాయి. ఇది తెలిసి కూడా మీరు వడ్లను కేంద్రమే కొనాలని మెలిక పెట్టడం ఎంత వరకు న్యాయం. పైగా 2021-22 సంవత్సరానికి గాను ఖరీఫ్‌ , రబీ పంటలకు సంబంధించి ధాన్యం సేకరించి బియ్యంగా మార్చి ఎఫ్‌ సీఐకి అప్పగించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య గతేడాది ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందాన్ని మీరే ఉల్లంఘించి తప్పుకుంటామని చెప్పడం ఎంత వరకు కరెక్ట్‌ కొనుగోలు కేంద్రాల మూసివేయాలనే మీ ఆలోచన ఇప్పటిది కానేకాదు.

మీ మనసులో మొదటి నుండి ఉన్న ఆలోచనే. కొనుగోలు కేంద్రాలను మూసివేస్తే మిల్లర్లు చెప్పిన రేటుకు రైతులు ధాన్యం అమ్ముకుంటరు. అప్పుడు మిల్లర్లకు వేల కోట్ల రూపాయలు దండుకుంటరు. అందులో నుండి వాటా దండుకోవచ్చనే దుర్భిద్దితోనే కొనుగోలు కేంద్రాలు మూసివేస్తున్నట్లు మీరు ప్రకటించారు. డైరెక్టుగా చెబితే జనం నుండి వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి…..నెపాన్ని కేంద్రంపై మోపుతూ సమస్యను పక్కదారి పట్టించే కథలు చెబుతున్నారు.

వరి ధాన్యం పండించే రాష్ట్రాలు చాలా ఉన్నయ్‌. అక్కడ ఎలాంటి గొడవ లేదు. సాఫీగా కొనుగోళ్లు జరుగుతున్నాయ్‌. ఇక్కడే ఎందుకు గొడవ వస్తోంది. మన పొరుగు రాష్ట్రం ఏపీలోనూ కేంద్రంతో ఏ గొడవా లేదు. మిల్లర్ల ప్రమేయం లేదు కదా.. మీ వైఖరిని చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ధాన్యం సేకరణలోనే పెద్ద కుంభకోణం దాగి ఉందనే ఉన్నట్లు కన్పిస్తోంది. రేషన్ బియ్యం రీ సైక్లింగ్, లేని పంటను లెక్కల్లో చూపడం, పక్క రాష్ట్రాల్లోని బియ్యాన్ని తెచ్చి అమ్మడం వంటి వ్యవహారాలు చాలా జరిగినట్లు మా దగ్గర సమాచారం ఉంది. మిల్లర్లు, మీరు కుమ్మక్కై చేస్తున్న ఈ స్కాం బండారం బయటపడుతుందని మీకు అర్ధమైంది. అందుకే కేంద్రంపై కావాలని గొడవ పెట్టుకుని సమస్యను దారి మళ్లిస్తున్నట్లు మాకు అర్ధమవుతోంది.

మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే…రైతులు పండించిన ధాన్యాన్ని, ప్రతీ గింజను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని బిజెపి తెలంగాణశాఖ డిమాండ్‌ చేస్తోంది. ధాన్యాన్ని కొనుగోలు చేయడం చేతకాకపోతే మీరు ముఖ్యమంత్రి పదవి నుండి తప్పుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాం. రైతుల జీవితాలతో మీరు, టీఆర్‌ఎస్‌ పార్టీ రాజకీయం చేస్తే బిజెపి చూస్తూ ఉరుకొదని హెచ్చరిస్తున్నాం. రైతులకు అండగా బిజెపి తెలంగాణశాఖ ఉద్యమించడానికి సిద్ధంగా ఉంది.

అభినందనలతో …

బండి సంజయ్‌కుమార్‌, ఎం.పి,
తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, బిజెపి.