మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం?..సీఎం, డిప్యూటీ సీఎం వీరే..

0
33

మహారాష్ట్ర రాజకీయ డ్రామా చివరి దశకు చేరింది. బలపరీక్షకు ముందే ముఖ్యమంత్రి పదవికి ఉద్దవ్ ఠాక్రే రాజీనామా చేశారు. దీనితో ప్రభుత్వం కుప్పకూలగా ప్రభుత్వం ఏర్పాటు దిశగా..బీజేపీ అడుగులు వేస్తుంది. ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని 42 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు, స్వతంత్రులు మద్దతు ఇస్తే ఇది సాధ్యమేనని రాజకీయ వర్గాల అభిప్రాయం.

ఒకవేళ ఇదే నిజమైతే మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ మరోసారి ఎన్నికయ్యే అవకాశాలున్నాయి. అంతేకాదు ఆయన జూలై 1, శుక్రవారం ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం. ఉద్దవ్ ప్రభుత్వాన్ని కూలదోసిన శివసేన రెబల్ ఎమ్మెల్యేలకు నేతృత్వం వహించిన  ఏక్‌నాథ్ షిండే డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపడతారని సమాచారం. రెబల్ ఎమ్మెల్యేలలో 10 మందికి మంత్రి పదవులు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఏం చేస్తారు? ఫడణవీస్‌ నేతృత్వంలో మరోసారి భాజపా ప్రభుత్వం ఏర్పాటవుతుందా? ఠాక్రే మద్దతుదారులు, ఆయన ప్రభుత్వానికి మద్దతు పలికిన కాంగ్రెస్‌, ఎన్‌సీపీలు ఎలా స్పందిస్తాయి? అనేవి ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.