బీసిలకు సీఎం కేసీఆర్ వలాల జల్లు

0
42

తెలంగాణలో వృత్తి జీవనం సబ్బండ వర్గాలను అనుసరించే కొనసాగుతున్నదని, కుల వృత్తులన్నీ బీసీ వర్గాలే నిర్వహిస్తున్ననేపథ్యంలో వారిని అన్ని రంగాల్లో ఆదుకోవడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రచించి కార్యాచరణ చేపట్టిందని, అందులో భాగంగా అమలు పరుస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచి తెలంగాణ బిసీ వర్గాల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు.

నాటి సమైక్య పాలనలో ధ్వంసమైన తెలంగాణ కుల వృత్తులను ఒక్కొక్కటిగా తీర్చిదిద్దుతూ, గాడిన పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అవిరామ కృషి ఫలితంగా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టమౌతూ, తెలంగాణ సబ్బండ కులాల జీవనంలో గుణాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయని సిఎం కెసిఆర్ తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలమైన కులవృత్తులను మరింతగా ప్రోత్సహిస్తామని సిఎం అన్నారు.

తెలంగాణ లో వృత్తి కులాలైన బిసీ వర్గాల అభ్యున్నతి – ప్రభుత్వ కార్యాచరణ – రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం అనే అంశాల పై ప్రగతి భవన్ లో మంగళవారం సిఎం కెసిఆర్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశం లో మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, టీఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు,సీఎం కార్యదర్శులు స్మితా సబర్వాల్, భూపాల్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రామకృష్ణా రావు తదితరులు పాల్గొన్నారు.

రెండో విడత గొర్రెల పంపిణీ :

తెలంగాణలో రెండవ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని త్వరలో నిర్వహించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ , అధికారులకు సిఎం కెసిఆర్ ఆదేశించారు. ఇప్పటికే మొదటి విడత ద్వారా రూ. 5000 కోట్ల ఖర్చుతో చేపట్టిన గొర్రెల పంపిణీ కార్యక్రమం అద్భుతమైన ఫలితాలనిచ్చిందని , ఈ నేపథ్యంలో రెండో విడత పంపిణీకోసం మరో 6000 కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్టు సిఎం తెలిపారు. అందుకు కావాల్సిన నిధులను సమకూర్చాలని ఆర్థిక శాఖ ను సిఎం ఆదేశించారు. దాంతో..మొదటి విడత తో పాటు రెండో విడతను కలుపుకుని తెలంగాణ గొల్ల కురుమ లకు గొర్రెల పంపిణీ కార్యక్రమాల కోసం మొత్తంగా 11,000 కోట్ల రూపాయలను కేటాయించినట్లవుతుంది. అంతేకాకుండా… ఇప్పుడు అందిస్తున్న గొర్రెల యూనిట్ ను అదే సంఖ్యతో కొనసాగించాలని సిఎం స్పష్టం చేశారు. దాంతోపాటు యూనిట్ (20+1) ధరను పెంచాలని సిఎం నిర్ణయించారు.
మొదటి విడతలో ఇప్పటికే 3.74 లక్షల యూనిట్లను పంపిణీ చేసామని, అదే పద్దతిలో యూనిట్ కు 20 గొర్రెలు 1 పొట్టేలు చొప్పున రెండో విడతలో 3.5 లక్షల గొర్రెల యూనిట్లను పంచనున్నట్టు సిఎం తెలిపారు. ధరలు పెరిగిన నేపథ్యంలో గొర్రెల యూనిట్ ధరను రూ. 1,75,000 కు పెంచుతూ సీఎం కెసిఆర్ నిర్ణయించారు. ఇప్పటికే డీడీ లు కట్టివున్న 14 వేల మంది అర్హులకు కూడా పెంచిన ధరను వర్తింప చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.

తెలంగాణలో గొల్ల కురుమలు,యాదవులకోసం అమలు చేస్తున్న గొర్రెల పంపిణీ కార్యక్రమం, బెస్థలు ముదిరాజుల కులవృత్తి అభివృద్ధికోసం అమలు చేస్తున్న చేపల పెంపకం కార్యక్రమాలు ఇప్పటికే అద్భుతాలను నమోదు చేశాయని సీఎం తెలిపారు. రాజస్తాన్ ను అధిగమించి, షీప్ పాపులేషన్ లో తెలంగాణ రాష్ట్రం దేశం లో నంబర్ వన్ స్థానానికి చేరుకున్నదని సీఎం కెసిఆర్ తెలిపారు.

ఈ సందర్భంగా సీఎం కెసిఆర్ మాట్లాడుతూ…” సమైక్య పాలనలో తెలంగాణ వ్యవసాయాన్ని సర్వనాశనం చేశారు. అనుబంధ కులవృత్తులను నిర్లక్ష్యం చేసి ధ్వసం చేశారు. నాడు తెలంగాణ రాష్ట్రం లో గ్రామీణ జీవన ముఖ చిత్రం కుప్ప కూలి పోయిన పరిస్థితి. నాటి పాలకులకు తెలంగాణ సబ్బండ వర్గాల వృత్తి జీవనం లోని ప్రత్యేకత, వైవిధ్యం అర్థం కాలేదు, వారికి ఆ సోయి కూడా లేదు. అద్భుతమైన వృత్తి నైపుణ్యం కలిగిన బీసీ వర్గాలను అల్లుకొనే తెలంగాణ లో కుల వృత్తుల జీవనం కొనసాగింది. ఉత్పత్తి, సేవా రంగాల్లో భాగస్వామ్యమైన సబ్బండ వర్గాలు కొనసాగించే కుల వృత్తులతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ముడిపడి వుంటది. అవన్నీ కూడా వ్యవసాయాన్ని అల్లుకొని కొనసాగుతాయి. ఉత్తర భారత దేశంలో మాదిరి కాకుండా వృత్తి కులాలన్నీ బీసీ వర్గాలే అధికశాతం నిర్వహించడం తెలంగాణ కు ప్రత్యేకం. ఆ ప్రత్యేకతను గుర్తించిన నూతన తెలంగాణ ప్రభుత్వం వారి అందరికీ అండగా నిలిచింది. మిషన్ కాకతీయ పథకం ప్రారంభం తో మొదలైన నూతన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రస్థానం, సాగు నీరు తాగు నీరు వ్యవస్థలను మెరుగుపరిచింది. గ్రామానికి అదేరువు గా వున్న చెరువు ను నిత్య జలాలతో నింపి సజీవంగా వుంచి, ధ్వంసమైన కుల వృత్తుల పునరుజ్జీవనమే లక్ష్యంగా ఏడేండ్ల పాటు రాష్ట్ర ప్రభుత్వం పాలన కొనసాగిస్తున్నది. అద్భుతమైన ఫలితాలు రాబడుతూ దేశంలోని అన్ని రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలిచింది..”” అని సీఎం వివరించారు. వ్యవసాయం అంటే పాడి పంట అని పంటలతో పాటు పాల ఉత్పత్తిలో తెలంగాణ అగ్రగామిగా అభివృద్ధి దిశగా పయనిస్తుందని తెలిపారు. పాల ఉత్తత్తి దారులకు ప్రభుత్వం సబ్సిడీలు అందించడంతో పాటు పలు విధాలుగా అండదండలందిస్తున్నదన్నారు. ప్రభుత్వం నడిపించే విజయాడైరీతో పాటు కరీంనగర్ డైరీ వంటి పాల ఉత్పత్తి సంస్థలు ప్రతిభావంతంగా పనిచేస్తున్నాయని సిఎం తెలిపారు.

చేనేత కార్మికులకు చేయూత :

” వ్యవసాయం తరువాత పెద్ద ఎత్త్తున ఆధారపడిన కులవృత్తి చేనేత రంగం. వొకనాడు బ్రాహ్మణుల తో సమానంగా ప్రజలనుండి గౌరవాన్ని పొందిన పద్మశాలి వర్గం నాటి సమైక్య పాలనలో ఆకలి చావులకు ఆత్మహత్యలకు బలైపోయింది. వలస పాలకుల వరుస నిర్లక్ష్యంతో అవసాన దశకు చేరుకున్న చేనేత వృత్తి , ప్రభుత్వ చిత్తశుద్ధి తో, మంత్రి కేటీఆర్ కార్య దక్షత తో ఇప్పుడిప్పుడే సాధారణ స్థితికి చేరుకున్నది. గాయాల పాలైన చేనేత వృత్తి గాడిన పడుతున్నది. రైతు బీమా మాదిరి పటిష్టంగా చేనేత కార్మికుల కోసం బీమా పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించినందున అందుకు సంబంధించి పటిష్ట కార్యాచరణ కోసం చర్యలే తీసుకోవాలని సిఎం అధికారులను ఆదేశించారు.

చేపల పెంపకం వృత్తి ని నిర్వహించే బెస్తలు, గంగపుత్రులు ముదిరాజ్ ల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నది అని సీఎం అన్నారు. మత్స్య సంపద రోజు రోజుకు అభివృద్ది చెందుతూ విస్తరిస్తున్నదన్నారు. కాళేశ్వరం తదితర ప్రాజెక్టుల నిర్మాణం తర్వాత తెలంగాణ లోని రిజర్వాయర్ లు నిండి చెరువులు కుంటలు జలకళను సంతరించుకున్నాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుల వరస క్రమం అంతా నిరంతరం నీటితో లైవ్ లో ఉంటుందని, కృష్ణా గోదావరీ నదుల పరీవాహక ప్రాంతంలో నీటి నిల్వ నిరంతరం ఉంటుందని సిఎం తెలిపారు. మిషన్ భగీరథ ఇన్ టేక్ వెల్స్ సహా నీటి నిల్వ వుండే ప్రతి అవకాశాన్ని చేపల పెంపకం కోసం సద్వినియోగం చేసుకోవాలని సిఎం అధికారులకు సూచించారు. ఈ నేపథ్యం లో ప్రభుత్వం చేస్తున్న ఉచిత చేపల పంపిణీ అద్భుత ఫలితాలను సాధిస్తున్నదన్నారు. ప్రతీ గ్రామం లోని చెరువులో మత్స్య సంపద పెద్ద ఎత్తున అభివ్రుద్ది చెందిందని తెలిపారు. గతం లో ఇతర ప్రాంతాల్లో నుంచి తెలంగాణ కు చేసుకునే చేపల దిగుమతి తగ్గిందన్నారు. సముద్ర ప్రాంతాలకు దూరంగా వున్న దేశం లోని పలు పట్టణాలు నగరాల్లో చేపల ఎగుమతి కోసం చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. చేపల పెంపకంలో అత్యాధునిక సాంకేతిక విధానాలు అవలంబించాలని మంచి చేపల విత్తనాలను ఎంపిక చేసుకోవాలన్నారు. గ్రామాల్లో చెరువుల్లో చేపల ఉత్పత్తి ప్రక్రియ మత్స్య శాఖ పర్యవేక్షణ లో నే వుంటుందన్నారు. చేపల పెంపకం సొసైటీ లో 18 ఎండ్లు నిండిన అర్హులైన యువకులకు అవకాశం కల్పించాలని సీఎం ఆదేశించారు.

ఇతర కులాలకు అభివృద్ధి ఫలాలు :

అదేసందర్భం లో వ్యవసాయం మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న మున్నూరుకాపులు సహా వడ్రంగి కమ్మరి కుమ్మరి వృత్తికులాలకు కల్లు గీత వృత్తి ద్వారా జీవనం సాగిస్తున్న గౌడ లు నాయి బ్రాహ్మణ రజక తదితర వృత్తి కులాల అభ్యున్నతికి వినూత్న పథకాలను అమలు చేస్తూ వారిని తెలంగాణ ప్రభుత్వం అభివృద్ది పథాన నడిపిస్తున్నది..” అని సీఎం కెసిఆర్ తెలిపారు.