వానలు, వరదలపై సిఎం కేసిఆర్ సమీక్ష

0
40

తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ అధికారులు పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ కూడా ప్రకటించారు. కాగా ఇప్పటికే 3 రోజులు విద్యాసంస్థలు మూసివేస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఇక తాజాగా ఈరోజు రాష్ట్రంలో వానలు, వరదల పరిస్థితిపై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది.

ఈ సమావేశంలో మంత్రులతో, ఎమ్మెల్యేలతో అలాగే అన్ని జిల్లాల అధికారులతో సీఎం మాట్లాడుతూ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. తక్షణ చర్యలపై సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. గోదావరి, గోదావరి ఉప నదుల్లో వరద పరిస్థితిని, ప్రవాహాన్ని గురించి ఆరా తీస్తున్నారు. ఎటువంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందని సిఎం కేసిఆర్ మరోమారు స్పష్టం చేశారు.

ఈ సమీక్షా సమావేశంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు దామోదర్ రావు, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు రాజీవ్ శర్మ, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, పైళ్ల శేఖర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.నర్సింగ రావు, సీఎంఓ కార్యదర్శులు రాజశేఖర్ రెడ్డి, స్మితా సబర్వాల్, భూపాల్ రెడ్డి, సీఎం ఓఎస్డి ప్రియాంక వర్ఘీస్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి  రామకృష్ణారావు, ఇరిగేషన్ శాఖ ఇఎన్సీ మురళీధర్, రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్, లా అండ్ ఆర్డర్ అడిషనల్ డిజి జితేందర్ తదితరులు పాల్గొన్నారు.